“ఓం నమశివాయ” అంటూ భక్త జనం జపం చేసే పవిత్రమైన దినం ఈ రోజు. శివనామస్మరణతో భక్త కోటి ముక్త కంఠంతో ఆ భోలా నాథుని స్మరించే తీరును చూస్తే.. మనసు శివతాండవం చేస్తుంది. ఈ అద్భుతమైన శివుని రేయి కోసం భక్త జనం కోటి ఆశలతో వేచి చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు పరమ శివున్ని మనసారా మొక్కుకోవాలని ఎదురు చూస్తుంటారు.
ఈ మహా శివరాత్రి సందర్భంగా దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే దేశంలోని ప్రతీ శివాలయం శివనామస్మరణతో మారుమోగుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రముఖ దేవాలయాల్లో కూడా మహా శివరాత్రి సంబురాలు ఆకాశాన్ని అంటుతాయి. అలాంటి దేవాలయాల సమగ్ర సమాచారం మీ కోసం.. మీకు గాని ఈ దేవాలయాలు దగ్గరగా ఉంటే మహా శివరాత్రి అక్కడ జరుపుకుని మహా శివుని ఆశీర్వాదాలు పొందండి.
తెలుగునాట వెలసిన ప్రముఖ శైవ క్షేత్రాలు
1. శ్రీశైల క్షేత్రం
భువిపై వెలసిన కైలాసంగా పేరొంది శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయం.. దేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి. అలాగే, అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది. ఏపీలోని కర్నూ జిల్లా నల్లమల అడవుల్లో కొలువైన శ్రీశైల క్షేత్రం కేవలం పుణ్యక్షేత్రంగానే కాకుండా, పర్యాటకస్థలంగా కూడా ఆకట్టుకుంటోంది. పచ్చని పర్వతాలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతంలో పర్యటన భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి ఈ క్షేత్రానికి ప్రాముఖ్యతుంది.

ఇక్ష్వాకులు, శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, విజయనగర సామ్రాజ్యాధీశులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, రెడ్డిరాజులు ఈ ఆలయాన్ని దర్శించి, ఆలయ ప్రాకారాలు నిర్మించారు. ఈ క్షేత్రం నిత్యం శివ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా శివరాత్రి పర్వదిన వేళల్లో భక్తజన సంద్రంతో కోలాహలంగా.. అత్యంత రమణీయంగా దీపకాంతులతో విరాజిల్లుతూ.. శివనామస్మరణలతో మార్మోగుతుంది.
2. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం
దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయం (వేములవాడ) తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను కలిగివుంది. ఇక్కడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై లింగరూపంలో వెలసిన పరమశివుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. శివరాత్రి రోజున ఈ ఆలయాన్ని లక్షలాది మంది భక్తులు సందర్శించి.. స్వామివారికి పూజలు చేస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో కోటి శివలింగాలు ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు.

ఇక్కడ భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైనది కోడె మొక్కు . భక్తులు ఎద్దుల గిత్తను తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, ఆ గిత్తను దేవాలయానికి దక్షిణగా సమర్పిస్తారు. దీనివల్ల సంతానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పవిత్రమైన గండ దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యకరమని భక్తులు భావిస్తారు.
3.కొమురవెల్లి మల్లిఖార్జున స్వామి ఆలయం

బండ సొరికల వెలసిన దేవునిగా కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని కీర్తిస్తారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జనవరిలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు జరుగుతాయి. మూడు నెలలపాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధిగాంచింది. స్వామి వారు కొమురవెల్లిలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై 11వ శతాబ్దంలో వెలసినట్లుగా శిలాశానాలద్వారా తెలుస్తోంది.
4. ఉమా మహేశ్వర దేవాలయం

నాగర్ కర్నూల్ జిల్లాలో రంగాపూర్ గ్రామానికి సమీపంలో సుందరమైన అటవీ ప్రాంతంలో కొండపై ఉమామహేశ్వర దేవాలయం ఉంది. ఉమామహేశ్వరం శ్రీశైలం ఉత్తర ద్వారంగా, జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. లింగరూపంలో వెలసిన మహాదేవుడు.. రెండు రంగుల్లో కనిపిస్తాడు. ఒకవైపు తెల్లగా, మరో వైపు ఏరుపురంగులో ఉంటుంది. క్రీ.శ 2 వ శతాబ్దం నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం మౌర్య చంద్రగుప్త పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు.
5. సలేశ్వరం

సలేశ్వరం ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ఆధ్యాత్మిక క్షేత్రం. మహబుబ్ నగర్ లోని నల్లమల అడవుల్లో ఉంది. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. ఇక్కడి జలపాతం అత్యంత రమణీయంగా ఉంటుంది.
6. కీసరగట్టు రామలింగేశ్వరాలయం

హైదరాబాద్ కు 30 కిలో మీటర్ల దూరంలో కిసరగుట్ట సమీపంలో ఈ శివరామ లింగేశ్వర ఆలయం ఉంది. తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండటంతో కేసరాలు (సంహాలు) గుంపులుగా సంచరించడంతో దీనిని కేసరిగుట్టగా పేరొందిందని స్థానికులు చేబుతుంటారు. మహాశివరాత్రి వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
7. కాళేశ్వరంలోన ముక్తేశ్వరాలయం
దేశంలో మరెక్కడలేని విధంగా గర్భగుడిలో రెండు లింగాలు ఉండటం కాళేశ్వరాలయం ప్రత్యేకత. ఈ దేవాలయం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది.

శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ది గాంచింది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక మహాన్యాస రుద్రాభిషేక పూజలు నిర్వహిస్తారు.
8. ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం

కాకాతీయుల కాలంలో నిర్మించిందే ఈ ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయం. ఇక్కడ వేలసిన మహాశివుడు ఐనవోలు మల్లన్నగా ప్రసిద్దికెక్కాడు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. స్వామివారి ఊరేగింపు, అగ్ని గుండాల కార్యక్రమం, వసంతోత్సవం, పుష్పయాగం ప్రత్యేకంగా ఉంటాయి.
9. వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరస్వామి దేవాలయం

తెలంగాణలోని వరంగల్ జిల్లా శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు. కాకాతీయ రాజుల తమ పాలన కాలంలో దాదాపు ఐదు వేలకు పైగా శివాలయాలను నిర్మించారని చరిత్ర చెబుతోంది. వేయి స్తంభాల గుడిలో పరమ శివుడు రుద్రేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. విశిష్ట నిర్మాణ శైలితో కూడిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 1138 – 1145 మధ్య కాలంలో కాకతి రుద్రదేవుడు నిర్మించాడు. ఆలయం చుట్టూ చెక్కబడిన శిల్పాలు, వాటిని చూడడానికి సుమారు పది అడుగుల ప్రదక్షిణా పథం ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తయిన ద్వారం నిర్మించబడింది. దీనికి ఎదురుగా సూర్య దేవాలయం, దక్షిణాభిముఖంగా వాసుదేవాలయాలు ఉండటంతో వేయి స్తంభాల గుడి త్రికూటాలయంగా పేరుగాంచింది. రుద్రేశ్వరాలయంలో నిత్య పూజలు, అభిషేకాలతో పాటు కార్తిక పౌర్ణమి, మహా శివరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
10. రామప్ప దేవాలయం

ములుగు జిల్లాలో రామప్ప దేవాలయం ఉంది. కాకతీయ రాజులు దీనిని నిర్మించారు. దీనిని రామలింగేశ్వర దేవాలయం అని కూడా అంటారు. శిల్పకళా నైపుణ్యానికి ఈ దేవాలయం నిదర్శనం. ఈ దేవాలయంలో రాముడు, శివుడు కలిసి ప్రధాన దైవంగా వెలసివున్నరు. దీనిలోని గర్భాలయంలో ఎత్తైన పీఠంపై నల్లరాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. శివరాత్రి రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.




ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!
శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు ?

