Breaking
Sat. Jun 28th, 2025

ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?

http://darvaaja.com/nizamabad-turmeric-farmers-set-deadline-to-mp-arvind-to-resign/
http://darvaaja.com/nizamabad-turmeric-farmers-set-deadline-to-mp-arvind-to-resign/

“అరవింద్ అన్నో.. నువ్వు చెప్పినట్లే టీఆర్ఎస్ ను వంగవెట్టి వీపుల గుద్దితిమి కదే! ఆ మహిళకు పసుపు విలువ తెల్వది అన్నందుకే కదా.. గాళ్లకు బుద్ది చెప్పింది. నువ్వు అధికరంలోకి వస్తే ఏడు అంటే ఏడు దినాల్లో పసుపు బోర్డ్ తీసుకొస్తా అన్నందుకే కదా.. 178 మందిమి నామినేషన్లు వేస్తిమి.. నీ గెలుపునకు కృషి జేస్తిమి. అయిన కూడా మా బతుకుల్లో ఏం మార్పులు వచ్చెనే ? కేంద్రానికి కూడా మా మీద కనికరం లేదని తెలుస్తోంది. నువ్వు పసుపు బోర్డ్ ఏర్పాటు లేకపోతే రాజీనామా చేస్తా అంటివి కదా.. పా ఇగ అదే పని చేసి.. మాతో కలిసి ఉద్యమం చేద్దువు” అని నిజామాబాద్ కు చెందిన రైతాంగం అంటోంది.

ఈ మాటల వెనుక దాగున్న బాధ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా పసుపు బోర్డ్ కోసం కొట్లాడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తూ వస్తోంది. పసుపు బోర్డ్ ను సాధించేందుకు అక్కడి రైతులు 2019 ఎన్నికల్లో వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టారు.

దాంతో “పసుపు బోర్డ్ ను ఏడు దినాల్లో తీసుకొస్తా.. లేదంటే రాజీనామా చేస్తా” అని చెప్పిన బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలుపొందారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2020 జనవరిలో నిజామాబాద్ లో స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేశారు. అక్కడ ముందు నుంచే ఉన్న స్పైసెస్‌ బోర్డు డివిజినల్‌ ఆఫీస్‌ను రీజనల్ ఆఫీస్‌గా మారుస్తున్నట్టుగా ప్రకటించారు. 

Nizamabad-Turmeric-farmers-set-deadline-to-MP-Arvind-to-resign-2 ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?

కానీ పసుపు బోర్డ్ ఏర్పాటు మీద ఎలాంటి నిర్ణయాన్ని కేంద్రం తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాద్ లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేసేది లేదని తేల్చినట్లు తెలుస్తోంది. దింతో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్న నిజామాబాద్ రైతాంగం ఆశలపై కేంద్రం నీళ్లు చల్లినట్లు అయ్యింది.

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని తేల్చి చెప్పేసింది. నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం కేంద్ర వాణిజ్యశాఖ, స్పైసెస్‌ బోర్డు రీజినల్‌ ఆఫీస్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

పసుపు, ఇతర సుంగధ ద్రవ్యాల ఎగుమతికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో బోర్డు ఆఫీసులు ఉన్నాయని పేర్కొంది. ఈ విషయంపై రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ సురేష్‌ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దీనిపై సోషల్ మీడియా ఏమంటోంది ?
తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటు చేయడం లేదనే వార్త వినగానే సోషల్ మీడియా భగ్గుమంది. ఎంపీ అరవింద్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రైతులను ఎంపీ అరవింద్‌ మోసం చేశాడంటూ ఎంతో మంది ట్వీట్లు చేస్తున్నారు. ఏడు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానంటూ డైలాగులు చెప్పి ఇప్పుడు ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. #CheaterArvind, #ResignFakeMP, #ArvindMustResign #BJPFailsTurmericBoard,    హ్యాష్‌ట్యాగ్‌లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.

నిజామాబాద్ లోనే పసుపు బోర్డ్ ఎందుకు కావాలి?
నిజమాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో పసుపు బాగా పండుతుంది. అలాగే ఇక్కడి రైతులు కూడా విస్తృతంగా సాగు చేస్తారు. అది ఎంతలా అంటే దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది.

Nizamabad-Turmeric-farmers-set-deadline-to-MP-Arvind-to-resign-1 ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?

అందుకే ఇక్కడ పసుపు బోర్డు ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. దాంతో వారికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పంట అభివృద్ధి, విస్తరణ,నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయని అంటున్నారు. పరిశోధనలు జరపడంతో ఎన్నో విషయాలు తెలుస్తాయని రైతులు చెబుతున్నారు. అలాగే రేటు విషయంలో కూడా మంచి జరుగుతుందని స్థానిక రైతు సంఘాలు చెబుతున్నాయి.

ఎంపీ అరవింద్ ఇప్పుడేం చేస్తారు ?
ఎంపీ అరవింద్ ఇప్పుడేం చేస్తారనే దానిమిదే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఎన్నికల్లో ఆయన గెలుపునకు కారణం కూడా పసుపు బోర్డ్ ప్రస్తావనే.. దాన్ని 7 రోజుల్లో తెస్తాను అని చెప్పడంతో మంచి మెజారిటీతో ఆయన గెలుపొందారు.

మరి ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తాడా ? లేక ఆయన రాసిన ప్రామిసరీ నోట్ లో చెప్పిన మాదిరి ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమం చేస్తారా అనేది వేచి చూడాలి.

పసుపు రైతులు ఏం అంటున్నారు ?
నిజామాబాద్ పసుపు రైతులు కేంద్ర మంత్రి చెప్పిన విషయంపై సీరియస్ గా ఉన్నారు. ఏదేమైనా సరే పసుపు బోర్డ్ సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైం లో వాళ్ళు తీసుకునే నిర్ణయంపై అందరి దృష్టి ఉందనే చెప్పాలి. వీళ్ళు కనుక ఉద్యమానికి దిగితే కేంద్రం దిగొస్తుందా.. లేక తన పంథాన్ని నెగ్గించుకుంటాదా అనేది తేలాల్సి ఉంది.

ఏది ఏమైనా ఇప్పుడు ఎంపీ అరవింద్, నిజామాబాద్ రైతాంగం తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేదానిపైనే అందరి చూపు ఉందని చెప్పాలి. దీనిపై పూర్తి అంచనాలు రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

Related Post