- గ్రాడ్యుయేట్లలో కరువైన అవగాహన
- ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 40 వేలకు పైగా ఓట్లు ఫెయిల్
“నేను పట్టభద్రున్ని..” అని కాలర్ ఎగరేసుకు తిరిగే వారంతా ఒకసారి ఆలోచించాల్సిన టైం వచ్చింది. తమ కోపాన్ని కన్న వారిపై కాకుండా సొసైటీని తమ గుప్పెట్లోకి తీసుకునే వారిపై చూపాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని తెలుసు అనుకునే గ్రాడ్యుయేట్లు, కొన్నింటిని ఇకనైనా జర యాదికి పెట్టుకోవాల్సిన ఘడియలు రానే వచ్చేసాయి. “ఎంత చదివినా.. యువత రాజకీయాల్లోకి వస్తే గానీ ఈ సమాజం మార్పు జరగదు” అని నమ్మే ఎంతో మంది వ్యక్తుల నమ్మకాన్ని నిలబెట్టాలన్నా.. కానీ పట్టభద్రులు కొన్ని చదవాలి.. మరికొన్ని మార్చాలి.. మరిన్ని నేర్చుకోవాలి. అది ఓటు కావొచ్చు. ఆ ఓటు వేసేందుకు తీసుకునే నోటు కావొచ్చు.
దీనిగురించి దర్వాజ.కామ్ ముందే జెప్పింది.. అరె ఓటును నోటును తీసుకునే ముందు, ఓటు వేసే ముందు యాదికి పెట్టుకునే విషయాల గురించి మరీ మరీ చెప్పింది. అరే మనలో ఎంతో మందికి కనీసం ఓటును కూడా ఎలా వేయాలో తెలియదని.. జర ఈ విషయాన్ని గ్రహించి.. దర్వాజ.కామ్ చెప్పే విషయాలను జర విని నలుగురితో షేర్ చేసుకోమన్నాం..

విన్నవాళ్లు తమ ఓటును ప్రియారిటీ ప్రాసెస్ లో తమకు నచ్చిన వారందరికీ వేశారు. కానీ “మాకు ఎవరేంది చెప్పేది..” అనుకునే వ్యక్తులు మాత్రం పప్పులో కాలేశారు. అంత కష్టపడి పట్నం నుంచి పల్లెకు, ఇంకో దేశం నుంచి పట్నానికి వచ్చి ఓటు వేసినా కూడా లాభం లేకుండా పోయింది. వారు చేసిన తప్పుల వలన హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో 40 వేలకు పైగా ఓట్లు చెల్లకుండా పోయాయి.
“అన్ని తెలుసు అనుకునే పట్టభద్రులకు ఓటును కూడా వేయరాదా ?” అంటూ ఎంతో మంది హేలన చేస్తున్నారు. ఒక్క ఓటుతో గెలుపు అవకాశాలు తారు మారు అయ్యే ఈ రోజుల్లో.. ఇంతగానం ఓట్లు ఫెయిల్ అవ్వడం అంటే అర్థం చేసుకోవాలి. మనకు ఎంతగానం తెలుసో.. మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలో.. కానీసం 1,2,3.. అనే నెంబర్లు వేయడంలో కూడా ఫెయిల్ అయితే.. మన డిగ్రీ పట్టా ఎందుకింకా ? 15-16 యేండ్ల సదువు ఎందుకింకా?
చదువురాని వాళ్లు కూడా ఓటును ఎలా వేయాలని అడిగి మరి తెలుసుకుని ఎంతో జాగ్రత్తగా వేస్తారు. కానీ మనకెందుకు ఇంత నిర్లక్షం ? ఓటు వేయడం అనేది నోట్లు తీసుకున్నోడు చేసే పని అనుకునే వ్యక్తులు ఉన్న సమాజంలో బతుకుతున్నాం.. సొసైటీ మారదు, ఇది ఇంతే.. అనుకుని ఇంట్లో కూర్చునే అవివేకులకంటే ఓటు వేయడం తెలియకున్నా ప్రయత్నం చేసిన మీరు గొప్ప.

కానీ.. మీరు గంటలు తరబడి నిలబడి ఓటు వేసింది. మీ ఓటు ఫెయిల్ అయ్యేందుకేనా ? ఒక్కసారి ఆలోచించండి. తెలియని దానిని తెలుసుకుంటే తప్పులేదు. ఈ ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మీ అర చేతిలోనే దాగి ఉంది. దాన్ని బయటకు తీసి మీకు ఉపయోగపడే వాటిగురించి అడగండి. అన్నీ అర సెకనులో చెబుతుంది. ఇలా నలుగురికి మంచి చేసే ప్రయాణంలో మీకు దర్వాజ.కామ్ కూడా తోడుగా నిలుస్తుంది.
అందుకే ఒకనైనా డిగ్రీ సదువుకున్నోడిని అనే పొగరును పక్కన పడేయండి. నేను తోపు, తురుము అనుకునే కంటే.. నేర్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. అని అనుకోండి. మీకు తెలియని విషయాలను పక్కనొళ్లను అడిగి తెలుసుకోండి. నీకు అది కూడా తెలియదా ? అన్నాడంటే అతనికి ఏది తెలియదని గుర్తించండి. యాది మరవొద్దు.. దేశాన్ని మార్చే శక్తి ఉన్న ఓటను వేసేటప్పుడు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలని. మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని.
–ఎడిటర్( దర్వాజ.కామ్)