- కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎదుర్కోళ్లు కార్యక్రమం
- నేడు శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం
దర్వాజ-రంగారెడ్డి
తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ లో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూనే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మోహినీ సేవ, బలిహరణం కొత్తుమురై గోష్టి, గరుడ సేవ, ఎదుర్కోళ్లు, మంగళహారతుల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నేడు (31-03-2021 బుధవారం) ఉదయం పారయణములు, 11 గంటలకు తిరుక్కళ్యాణోత్సవం జరగనుందని ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు. సాయంత్రం స్వామివారికి గజవాహన సేవ ఉంటుందని వెల్లడించారు.

కాగా, తిరుక్కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలని దేవుని పడకల్ గ్రామ అధికారులు వెల్లడించారు. జాతర నేపథ్యంలోనే కోవిడ్-19 నిబంధనల నడుమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనీ, కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు.

