అవును ఎవుసం పనులు మేం జెయ్యం. రైతే రాజు అని గొప్పగా చెప్పుకునే ఈ దేశంలో అన్నదాత దేహీ అనాల్సిన దుస్థితి వచ్చింది. రాజుకింద పని జేసుడు అదృష్టంగా భావించిన మాకు ఇప్పుడు ఎవుసం నచ్చుతలేదు. ఎందుకంటరా.. బంగారం లాంటి భూములను జూసుకుని మురవాల్సిన రైతన్న.. నాకీ భూమి ఎందుకిచ్చినవ్ రా దేవుడా అని ఉరేసుకుంటున్నడు. ఎందుకో ఎరుకనా.. అప్పులు జేసిండ్రు. సదువురాని అన్నలను జూసి అధిక వడ్డీకి నాసీరకం ఇత్తనాలు ఇచ్చిరి. అవి తెచ్చి దుక్కి దున్ని, నీళ్లు పెట్టి ఇత్తనం నాటితే.. మొలకలు రాని వాటిని జూసి రైతన్నల గుండెలు పగుల్తున్నయి.

అయ్యో రామ చంద్ర గిట్లున్నయేంది సేటు అని అడిగితే.. నేను తయారుచేసిన్నారా బై అని అంటిరి. విత్తనాల నుంచి, ఎరువులు, కలుపు మందులు అన్నీ నకిలీవే. గాళ్లు రైతులు కదా.. అందుకే వాటిని అంటగడుతుర్రు. ప్రభుత్వమన్నా గాళ్లను ఆదుకుంటదేమో అంటే.. సాగు చట్టాలు , అవి ఇవీ అంటూ.. సబ్సీడీలను ఎత్తేస్తూ నోట్లో మట్టికొడుతుర్రు. ఎవుసం చేసే గాళ్ల బాధలు మేము సూడలేం. వాళ్లేట్ల అప్పులపాలయ్యి పాణాలు తీసుకుంటుర్రు. అందుకే ఎవుసం జేయ్యనీకె భూములున్నోళ్లు కూడా ముందుకు వస్తలేరు. అప్పుల పాలైన రైతన్నల కింద మేం పని జేసి గాళ్లను బాధవెట్టలేం. గందుకే .. కేవలం గందుకే.. మేము ఎవుసం చెయ్యం అని తెగేసి చెబుతున్నరు వ్యవసాయ కార్మికులు.
దేశంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందన్న భయంకరమైన నిజాన్నిభారత్ లో మహిళలు, పురుషులు 2020 అంశం విడుదల చేసిన ఒక నివేదికలో వెల్లడైంది. కాగా ఈ నివేదికను కేంద్రం విడుదల చేసింది. ఆడవాళ్లు, మగవారు అని తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో.. పట్టణ ప్రాంతాల్లో ఎవుసం అందరూ జేసేటోళ్లు. కానీ 30 ఏండ్లుగా వ్యవసాయ రంగంలో మహిళలతో పాటుగా పురుషులు సంఖ్య కూడా రోజురోజుకు తగ్గుతుందని చెప్పిండ్రు.
వ్యవసాయ కార్మికుల సంఖ్య ఎంత తగ్గిందంటే…

ఒకప్పుడు ఇండియాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఎవుసం పనులు జేస్తూనే ఎక్కువమంది బతికెటోళ్లు. రాను రాను ఎవుసం జేసేటోళ్లు.. ఎవుసం పనులు జేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారు కూడా తగ్గుతున్నరు. మగ, ఆడ అనే తేడా లేకుండా వ్యవసాయం చేసేటోళ్లు. కానీ ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య భారీ మొత్తంలో తగ్గుకుంటూ వెళుతోంది. 1987-88 నుంచి 2018-19 వరకు వ్యవసాయ కార్మికుల సంఖ్య ఎలా ఉందంటే.. పీఎల్ఎఫ్ సర్వే ప్రకారం.. 1987-88 కాలంలో వ్యవసాయ కార్మికుల సంఖ్య 84.7 శాతం ఉంటే.. అందులో పురుషుల వాటా 74.5 శాతంగా ఉంది.
ఇకపోతే ఈ శాతం కాస్త 2018-19 సంవత్సరానికి 73.2 శాతానికి తగ్గిపోయింది. ఇందులో పురుషుల వాటా 55 శాతంగా ఉంది. తినే వాడి సంఖ్య రోజు రోజు పెరుగుకుంటూ వెళ్తున్నా.. ఎవుస పనులు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వస్తోంది.
హోటల్లో.. రెస్టారెంట్లలో పనిచేసే వారి సంఖ్య ఎంతంటే..

ఇంకో ముఖ్యమైన విషయం వ్యవసాయం పై ఆధారపడి జీవించే వారి సంఖ్య కంటే.. హోటల్లు, రెస్టారెంట్ సెక్టార్లలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోతూ వస్తోందని సర్వే చెబుతోంది. దీనిని ప్రధాన కారణం వ్యవసాయ కూలీలు క్రమంగా ఈ రంగంలోని పనుల్లోకి వెళ్లడమేనని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 1987 లో ఈ రంగంపై గ్రామీణ ప్రాంతాల పురుషుల సంఖ్య 5.1 శాతంగా ఉన్నది. అదే 2018-19 వచ్చే సరికి ఈ శాతం 9.2 శాతానికి చేరుకుంది. పల్లెల్లో ఇలా ఉంటే.. పట్టణాల్లో ఇది 21.5 శాతం నుంచి ఏకంగా 24.5 శాతానికి ఎగబాకింది. ఇకపోతే.. ఈ రంగంలో మహిళల సంఖ్య గ్రామాల్లో 2.1 శాతం నుంచి 4 శాతానికి చేరింది. ఇక పట్టణ ప్రాంతాల్లో 9.8 నుంచి 13 శాతానికి చేరింది.