1. దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర సహా మరో 12 రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్ సరఫరాను పెంచినట్టు కేంద్రం తెలిపింది. అయినప్పటికీ.. దేశంలోని చాలా చోట్ల పడకల కొరత, ఆక్సిజన్ కొరత కారణంగా వైద్యం అందక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి.
2. ఆక్సిజన్ కొరత నేపథ్యంలో పరిశ్రమల ఉపయోగానికి కేటాయించిన నిల్వలను సైతం వైద్యం ఉపయోగం కోసం వినియోగించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే గ్రీన్ కారిడార్ల ద్వారా ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపనున్నట్టు, ఇప్పటికే దీనికోసం ఏర్పాట్టు చేసినట్టు తెలిపింది.
3. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల్లో మహారాష్ట్ర (68,631), ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధికం నమోదయ్యాయి.
4. కరోనా పంజా నేపథ్యంలో బీహార్, రాజస్థాన్, తమిళనాడు, మణిపూర్ లు తాజా ఆంక్షలను ప్రకటించాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ తో పాటు మే 15 వరకు బీహార్ లో మాల్స్, పాఠశాలలు, సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
5. కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత వేగం పెంచాలనీ, దీని కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. మరో వైపు టీకాలు లేకుండా ఎలా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. సరిపడ టీకాలు వెంటనే అందించాలని కోరుతున్నాయి. కాగా, దేశంలో ఇప్పటివరకు 12 కోట్ల టీకాలను అందించారు.
6. దేశరాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ మధ్య సమావేశం జరిగింది. కరోనా పరిస్థితులు, వారాంతపు కర్ఫ్యూ పొడిగించే అవకాశాలపై మాట్లాడినట్టు సమాచారం. అలాగే, ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోడీకి లేఖ రాశారు.
7. దేశంలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న రాజకీయ నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా బీహార్ మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు.
8. భారత్ లో కరోనా రోగులకు వైద్యం అందడం లేదనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి వీకే సింగ్ చేసిన ట్వీట్ ఆసక్తి రేకెత్తించింది. తన నియోజకవర్గ పరిధి ఘజియాబాద్లో కరోనా సోకిన ఓ వ్యక్తి గురించి ప్రస్తావిస్తూ ‘‘ నా సోదరుడికి కరోనా సోకింది.ఆస్పత్రిలో ఓ పడకను ఏర్పాటు చేయాలని ఘజియాబాద్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
9. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 14 కోట్లకు పైగా కేసులు, 30 లక్షల మరణాలు నమోదయ్యాయి.
10. ప్రపంచలో అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, భారత్, బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్ దేశాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.