- ఢిల్లీలో కరోనా మరణ మృదంగం
- తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
- తీవ్రంగా ఆక్సిజన్ కొరత, రోగులతో ఆస్పత్రులు కిటకిట
- గత 24 గంటల్లో కొత్తగా 24,331 కరోనా కేసులు, 348 మరణాలు
దర్వాజ-న్యూఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కల్లోలం రేపుతోంది. భారీ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతుండటంతో ఇప్పటికే అక్కడి ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఒక్కో పడకపై ఇద్దరు ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి పలు చోట్ల దాపురించింది. దీనికి తోడు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే ఆక్సిజన్ కొరత కారణంగా ఒకే ఆస్పత్రిలో 25 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ దుర్ఘటన ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆక్సిజన్ కొరత వల్ల ఏకంగా 25 మంది రోగులు మరణించారు. ఆస్పత్రికి చెందిన ఓ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం కేటాయించిన 3.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అందాల్సివుంది. అయితే, అర్థరాత్రి అయినప్పటికి కూడా అందలేదు. దీంతో అప్పటికే ఆక్సిజన్ ప్రేజర్ తగ్గిపోవడంతో 25 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఆక్సిజన్ కొరత నేపథ్యంలో మరింత మంది రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందనీ, తమ ఆస్పత్రికి ఆక్సిజన్ వెంటనే అందజేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, ఢిల్లీలోని మూల్ చంద్ ఆస్పత్రి సైతం తమ ఆస్పత్రిలో 130 మంది కరోనా రోగులు లైఫ్ సపోర్ట్ మీద ఉన్నారనీ, ఆక్సిజన్ కొరత తమను ఎంతో ఒత్తిడికి గురి చేస్తోందనీ, అత్యవసరంగా తమకు సహకారం అందించాలని ప్రధాని మోడీ, సీఎం కేజ్రీవాల్ సహా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను కోరింది.
కాగా, తగ 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 24,331 కరోనా చేసులు, 348 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,80,679 చేరగా, మరణాలు 13,541కి పెరిగాయి. ప్రస్తుతం 92,029 యాక్టివ్ కేసులు ఉన్నాయి.