దర్వాజ-న్యూఢిల్లీ
దేశంలో కరోనా మహమ్మారి సృష్టిస్తున్న కల్లోలం మాములుగా లేదు. నిత్యం లక్షలాది మందిని అనారోగ్యానికి గురిచేస్తోంది. వేలాది మందిని బలి తీసుకుంటోంది. రోజురోజుకూ తన ప్రభావాన్నిపెంచుకుంటూనే ఉంది. దీంతో స్మశానాలు సైతం ఖాళీ లేకుండా హౌస్ఫుల్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయంటే దేశంలో కరోనా మహమ్మారి బలి తీసకుంటున్న వారి సంఖ్య కాగితాలపై కనిపించే దానికంటే అధికంగానే ఉందని ఇట్టే స్పస్టమవుతోంది.
అయితే, దేశంలో ఇంత దారుణ పరిస్థితులు కనిపిస్తున్న ప్రభుత్వాలు తమ వైఖరీలో మార్పు మాత్రం తీసుకురాకుండా ముందుకు సాగుతుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కల్లోలం రేపుతుంటే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చూపిన శ్రద్ధ కరోనా కట్టడిపై చూపివుంటే దేశంలో నేడు ఈ పరిస్థితి ఉండేది కాదనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దేశంలో కరోనా ప్రజల ప్రాణాలను హరిస్తుండటం.. మరీ ముఖ్యంగా ప్రాణాలు నిలిపే ఆక్సిజనే.. నేడు రోగుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్న వేళ ఈ సమస్యలను పరిష్కారం దిశగా పనిచేయాల్సిన ప్రభుత్వం నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు మాత్రం అపకుండా ఉండేందు లైన్ క్లియర్ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారీ తీసింది. ఈ విషయంలో కేంద్ర సర్కారుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఢిల్లీలలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా 25 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు. హర్యానా,పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్లోనూ ఆక్సిజన్ కొరత కారణంగా 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన సైతం చేశారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కారిడార్ల ద్వారా రైళ్లలో అన్నిరాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని కేంద్రం నిత్యం పలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటోంది. అయితే, కేంద్ర చెబుతున్నట్టు ఆక్సిజన్ సరిపడినంత సరఫరా చేయడం, నిల్వలు ఉంటే ఆక్సిజన్ కొరత మరణాలు ఎందుకు నమోదవుతున్నాయి? అని ప్రతిపక్షాలు సహా సమాన్య జనం సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా న్యాయస్థానాలు సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

అలాగే, ఆస్పత్రులు సైతం తమకు ఆక్సిజన్ అందించండి.. తమ పేషంట్లను రక్షించండి అని సోషల్ మీడియాలో అర్థించడం ప్రస్తుత పరిస్థితికి నిలువెత్తు నిదర్శనం. ఇదే విషయంపై తమ ఆస్పత్రిలో ఉన్న 25 నుంచి 30 మంది నవజాత శిశువుల ప్రాణాలు కాపాడటానికి వెంటనే ఆక్సిజన్ అందించడని ఢిల్లీలోని ఓ ఆస్పత్రి తాజాగా అందరికీ విజ్ఞప్తులు చేసింది.
ఇదిలా ఉంటే కర్నాకటలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఏకంగా 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని మృతుల కుంటుంబ సభ్యులు, పలు మీడియా సంస్థలు బయటపెడితే.. వారి చావులకు కారణం ఆక్సిజన్ కొరత కాదని బుకాయించడం.. దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పడం ప్రభుత్వ పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని నిపుణులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాష్ట్రాలు సైతం ఆరోగ్య సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకలు నిండిపోగా.. పలుచోట్ల ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. తాజాగా ఎపీలోని అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు రోగులు చనిపోయారని మృతుల బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.
ఇలాంటి దారుణ పరిస్థితుల నుంచి ప్రజల బయటపడేయడంలో ప్రభుత్వాలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఇప్పటికే పలువురు నిపుణులు పేర్కొన్నారు. ప్రజలు సైతం ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడమే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోని వైద్య, ఆరోగ్య నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన నిపుణుల సలహాలు సూచనలతో కరోనా కట్టడికి ముందడుగు వేయాలనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.