23 కోట్ల మందిపై కరోనా కాటు !
దర్వాజ-న్యూఢిల్లీ
కరోనా మహమ్మారి భారత్లో సృష్టిస్తున్న కల్లోలం మాములుగా లేదు. ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న కోవిడ్-19 కారణంగా దేశంలో ఆర్థిక, ఆరోగ్య సంక్షోభం తలెత్తింది. మరీ ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధిని కోల్పోయేలా చేసిన కరోనా మహమ్మారి.. దేశ ప్రజలను కడు పేదరికంలోకి నెట్టేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది.
కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా దేశంలోని దాదాపు 23 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి (దారిద్య్ర రేఖ దిగువకు) జారుకున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దీనికి కరోనా సంబంధిత, ప్రభుత్వ చర్యలు, లాక్ డౌన్ వంటి పలు అంశాలు ప్రధాన కారణాలు అని వెల్లడించింది.
అజీం ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం (ఏపీయూ) సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎంప్లాయిమెంట్ విభాగం కరోనా మహమ్మారి, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజలు వంటి అంశాలకు సంబంధించి తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2021 వన్ ఇయర్ ఆఫ్ కోవిడ్-19’ పేరుతో ఈ నివేదిక వివరాలను తాజాగా వెల్లడించారు.
ఈ నివేదిక ప్రకారం.. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కోవిడ్-19 తో ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అనేక మంది తమ ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దాదాపు 23 కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారు. గ్రామీణ దారిద్ర్య రేటు 15 శాతం పాయింట్లు, పట్టణ పేదరికం రేటు దాదాపు 20 పాయింట్లు పెరిగిందని నివేదిక పేర్కొంది.
అలాగే, కరోనా మహమ్మారి పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు 20 శాతం పేద కుటుంబాలు తమ మొత్తం ఆదాయ వనరులను కోల్పోయాయి. 2020 చివరి నాటికి 1.5 కోట్ల మంది కార్మికులు పనిలో లేరు. దేశవ్యాప్తంగా ఏప్రిల్-మే-2020 లాక్ డౌన్ సమయంలో సుమారు 10 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో ఉద్యోగాలు కోల్పోయిన వారు అధికంగా ఉన్నారు.
ముఖ్యంగా రెండు అంశాలను మన ముందు రెండు సవాళ్లుగా ఈ నివేదిక పేర్కొంది. అందులో మొదటిది కరోనా కారణంగా గతేడాది జరిగిన నష్టాన్ని పూడ్చడం. రెండోది ప్రస్తుతం కోనసాగుతున్న సెకండ్వేవ్.. రాబోయే కరోనా కల్లోలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొవడం. ప్రభుత్వం ఈ దిశగా సాగాలని సూచన చేసింది.
Share this content: