ఆ జిల్లాల్లో సగం మందికి కరోనా !
- 40 శాతం జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు
- దేశంలో కొత్తగా 4 వేలకు పైగా కరోనా మరణాలు
దర్వాజ-న్యూఢిల్లీ
భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్, టీకాల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో పెరడగంపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోని 40 శాతం జిల్లాల్లో 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉంది. మొత్తం 741 జిల్లాలకుగానూ 301 జిల్లాల్లో 20 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదువుతోంది. వాటిలో 15 జిల్లాల్లో అయితే ఏకంగా 50 శాతానికిపైగానే పాజిటివిటీ రేటు ఉండటం భారత్ లో వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది.
50 శాతానికి పైగా పాజిటివిటీ రేటు నమోదవుతున్న15 జిల్లాలు అధికంగా హర్యానా, అరుణాచల్ప్రదేశ్, రాజస్థాన్ లలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని చంగ్లాంగ్ జిల్లాలో అత్యధికంగా 91.5 శాతం పాజిటివిటీ రేటు ఉంది. అలాగే, దిబాన్ వ్యాలీతోపాటు పుదుచ్చేరిలోని యానాం, రాజస్థాన్లోని బికనీర్, పాలీ జిల్లాల్లో అత్యధిక పాజిటివిటీ రేటు నమోదవుతోంది. అలాగే, కేరళలోని 13, హర్యానాలో 19, బెంగాల్లో 19, ఢిల్లీలో 9, కర్నాటకలో 24 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 20 శాతానికిపైగా నమోదైంది.
కొత్తగా 4 వేలకు పైగా కరోనా మరణాలు
భారత్లో కరోనా మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 4,092 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 4,03,738 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 2,22,96,414కు చేరగా, మరణాలు 2,42,362కు పెరిగాయి. ఇప్పటివరకు 1,83,17,404 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 37,36,648 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 16,94,39,663 మందికి వ్యాక్సిన్లు వేశారు. అలాగే, 30,22,75,471 కరోనా పరీక్షలు నిర్వహించారు.
Share this content: