అసమానత.. నిరుద్యోగ భారత్ !
- అసంఘటిత కార్మికులపై తీవ్ర ప్రభావం
- అధికమవుతున్న అసమానతలు.. పెరుగుతున్న పేదలు
- భారత ఆర్థిక వృద్ధి గణాంకాలను తగ్గిస్తున్న రేటింగ్ సంస్థలు
దర్వాజ-న్యూఢిల్లీ
భారత్లో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించింది. వైరస్ కారణంగా దేశంలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. మార్చిలో 6.50 శాతంగా ఉన్న జాతీయ నిరుద్యోగిత రేటు ఏప్రిల్ నాటికి 7.97 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. పట్టణాల్లో నిరుద్యోగిత రేటు 9 .13 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 7.13 శాతంగా ఉంది.
సెంటర్ ‘ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తాజా గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతంగా ఉండగా.. పట్టణాల్లో 10.49 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 7 శాతంగా ఉంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఆంక్షలు, లాక్డౌన్ ప్రభావం ఉపాధి, ఉద్యోగాలపై పడిందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోక పోవడం ప్రధాన కారణంగా పేర్కొంటున్నాయి.
రాబోయే కాలంలో ఉద్యోగ కల్పన సవాలే..
కాగా, గత ఏప్రిల్ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఇటీవల సీఎంఐఈ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేశ్ వ్యాస్ తెలిపారు. ఫలితంగా నిరుద్యోగిత రేటు మరింత పెరిగిందన్నారు. దేశంలో తాజుగా చోటుచేసుకుంటున్న పరిస్థితులు భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు పెను సవాలుగా మారే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం వైద్యారోగ్య సేవల ఒత్తిడిని ఎదుర్కొంటుందనీ, మే నెలలో ప్రభావం మరింత ఎక్కువ ఉండవచ్చన్నారు.
కరోనా కట్టడికి మెరుగైన వేగవంతమైన చర్యలు తీసుకోకపోవడం, కోవిడ్-19 టీకాలు నెమ్మదిగా వేయడం, ముందుస్తు చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థ పునురుద్ధరణ చర్యలను తీవ్రంగా దెబ్బతీశాయని ప్రముఖ ఆర్థికవేత్త రాహుల్ విజోరియా పేర్కొన్నారు.
అధికమవుతున్న అసమానతలు.. పెరుగుతున్న పేదలు
గతేడాది నుంచి భారత్లో అసమానతలు తీవ్రమవుతున్నాయి. కరోనా ప్రారంభం నుంచి 75 మిలియన్లు మంది పేదరికంలోకి జారుకున్నారని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం వెల్లడించింది. అలాగే, అజీం ప్రేమ్ జీ యూనివర్సిటీ అధ్యయనం సైతం 23 కోట్ల మంది దారిద్య్ర రేక దిగువకు జారుకున్నారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేటు 15 పాయింట్లు, పట్టణ పేదరిక రేటు 20 పాయింట్లు పెరిగిందని పేర్కొంది.
రోజువారీ ఆదాయాలు సైతం గణనీయంగా తగ్గిపోయాయని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వృద్ధి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉన్నా ఆర్ధిక అసమానత దేశాల్లో ఒకటిగా ఉంటుందని ఆక్స్ ఫామ్ పేర్కొంది. ప్రస్తుతం అనధికారిక కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దేశ దీర్ఘ కాలిక వృద్ధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. దీనికి అసమానతల తీవ్రత కూడా కారణమని తెలిపారు.
ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ..
గతేడాది మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి భారత్ ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉంది. ముగిసిన మార్చితో భారత స్థూల జాతీయోత్పత్తి 8 శాతం తగ్గిందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. ఇది 1952 నుంచి అతిపెద్ద సంకోచం. పెరుగుతున్న నిరుద్యోగం, తగ్గుతున్న పోదువులు దేశ రెండంకెల వృద్ధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇదివరకటి అంచనాలను అనేక రేటింగ్ సంస్థలు తగ్గిస్తున్నాయి.
ఎస్. అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనామిస్ట్ షాన్ రోచె తన అంచనాను 11 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గించారు. కరోనా కారణంగా శాశ్వత ఉత్పత్తి నష్టాన్ని ఎదుర్కొంటుందనీ, ఇది జీడీపీలో 10 శాతానికి సమానమైన దీర్ఘకాలిక ఉత్పత్తి లోటును సూచిస్తుందన్నారు. ఇక ఫిచ్ సొల్యూషన్స్ సైతం 9.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. బ్లూమ్బర్గ్ సైతం తన అంచనాలు తగ్గించింది. అలాగే, దేశ గృహ పోదువులు ఈ త్రైమాసికంలో 22.1 శాతానికి పడిపోయాయనీ, ఇది దేశీయ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Share this content: