దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలల్లో వైరస్ బారినపడటంతో పాటు వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది కరోనా నుంచి కోలుకుంటున్నారు. ఇక కోలుకున్నప్పటికీ కొన్ని రోజుల పాటు పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయని ఇప్పటికే వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న ప్రజలను తాజాగా మరో వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే దీని భారినపడితే 50 శాతం అధికంగా మరణ రేటు ఉంటుంది. అదే బ్లాక్ పంగస్, మ్యూకోర్మైసిస్. దేశంలో నేడు దీనిపైనే తెగ చర్చ నడుస్తోంది.
ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, యూపీవంటి రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్మైసిస్గా పిలువబడే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ను గుర్తించారు. సూరత్తో ఈ వ్యాధి సోకిన 40 మందిలో 9 మంది కంటి చూపును కోల్పోయారు. మహారాష్ట్రలో మొత్తంగా 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉండే అవకాశముందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఒడిశాలోనూ ఈ రకం కేసులు నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ఈ రకం కేసులు గుర్తించిన వైద్యులు ఇద్దరికి శస్త్ర చికిత్సలు చేసి.. ఒకరికి కన్ను, మరొకరికి దవడ తొలగించి ప్రాణాలు కాపాడారు. ఉత్తరప్రదేశ్నూ ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇంత ప్రమాదకారిగా అయిన ఈ బ్లాక్ ఫంగస్ ఏంటీ? దీనికి వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయా? అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ప్రశ్నలు నేడు అందరి మదిలో మెదులుతున్నాయి. ఇంతలా భయాందోళనకు గురిచేస్తున్న బ్లాక్ ఫంగస్ గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
ఏంటీ ఈ బ్లాక్ ఫంగస్?
బ్లాక్ ఫంగస్… దీనిని వైద్య పరిభాషలో మ్యూకోర్ మైసిస్ అని పిలుస్తారు. ఇది మనుషులకు సోకే అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది ముకోర్ అనే ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది. ఇది అన్నిచోట్లా ఉంటుంది. మట్టిలో, గాల్లో, కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయలు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల ముక్కులో, చీమిడిలో కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కరోనా సోకిన వారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఇది ఎక్కువ సోకే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
బ్లాక్ ఫంగస్ మొదటగా సైనస్లోకి చేరి.. ఊపిరితిత్తులు, కండ్లను అటాక్ చేస్తుంది. క్రమంగా ఊపిరితిత్తులను బలహీన పరుస్తుందనీ, దృష్టిలోపానికి కారణం అవుతుందని నితి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. తర్వాత మెదడులోకి చేరి బ్రెయిన్ డెడ్కు కారణం అవుతుంది. దీంతో మనిషి ప్రాణాలు పోతాయి. డయాబెటిక్ రోగులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే క్యాన్సర్ లేదా హెచ్ఐవీ లాంటివి ఉన్న రోగులకు ఇది ప్రాణాంతకం కావచ్చు.

లక్షణాలేంటి?
సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో రెండుమూడు రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ సోకినవారిలో ముక్కు ఒకవైపు మూసుకుపోవడం, కండ్ల దగ్గర వాపు, మంట, కంటిచూపు తగ్గిపోవడం, ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, అవయవాల్లో నల్లటి మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఇవన్నీ లక్షణాలు కనిపించకోవచ్చునని చెబుతున్నారు.
చికిత్స ఉందా?
బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్కు ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉందనీ, మందులు సైతం ఉన్నాయని వైద్యలు పేర్కొంటున్నారు. అయితే, దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్ మెంట్ అందిస్తే ప్రాణాలు పోకుండా కాపాడవచ్చుని చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని పరిశోధకులు తెలుపుతున్నారు. మ్యూకోర్మైకోసిస్ బాధితులకు ఈఎన్టీ, కంటి చూపు, న్యూరో వైద్యుల సహాయం అవసరమవుతుందంటున్నారు.

మ్యూకోర్మైకోసిస్పై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పలు సూచనలు చేసింది. ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని పేర్కొంది. కానీ, దీనిని ముందుగానే గుర్తించి యాంటీఫంగల్ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వెల్లడించింది. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని పేర్కొంది.
చికిత్సకు భారీ ఖర్చు.. మందుల కొరత
అయితే, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ చికిత్స మందులు ఖర్చుతో కూడుకున్నవి. అయినప్పటికీ దేశంలో ప్రస్తుతం వీటి కొరత ఉంది. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు వైద్యం అందిస్తూ.. యాఫోటెరిసన్ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్ కోసం సుమారు రూ.9 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ మందుల కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్స మందులను ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రులకు సరిపడినన్ని అందించే విధింగా ఉత్పత్తిని పెంచాలని ఫార్మా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.