ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కనిపించని కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. ఈ మహమ్మారి భారిన పడి ఎంతో మంది ప్రాణాలను విడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కరోనా సోకకుండా ఉండాలంటే ‘ఇవి తింటే రాదు, ఈ చిట్కాలు పాటిస్తే సరి కరోనా మీ దరి చేరదంటూ.. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఇవి ఖచ్చితంగా పాటించినట్టైతే గనుక మీరు ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరమే రాదంటూ ప్రచారాలు చేస్తున్నారు కొందరు సోషల్ మీడియా వేధికగా. ఈ ప్రచారాలలో ఒకటి వేడినీళ్లతో స్నానం చేస్తే కరోనా రాదంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఈ విషయం వట్టి పుకారే నంటూ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల కరోనా రాదన్నది, తగ్గించడమన్నది పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. అయితే ఈ వైరస్ ల్యాబోరేటరీల్లో 70 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే చనిపోతుందని తేల్చి చెప్పింది. అయితే వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా రాదన్నది అవాస్తవం అయినప్పటికీ.. వేడి నీటి స్నానం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒళ్లు నొప్పులు కూడా తగ్గి.. మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటితో పాటుగా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేడి నీటి స్నానం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది. కాగా చిటికెడు పసుపు, ఉప్పును వేడి నీటిలో కలిపి పుకిలించడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. అలాగే ప్రతి రోజూ వేడినీటిని తాగడం తో శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు వెళ్లడంతో పాటుగా, జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కాలు పాటిస్తే కరోనా రాదంటూ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకండని ప్రజలకు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే ఈ మధ్యన కొందరు గోమూత్రం తాగితే లేదా గోవు పేడను, మూత్రాన్ని శరీరానికి పట్టిస్తే కూడా కరోనా రాదనడం వట్టి పూకార్లేనంటూ తేల్చి చెప్పింది. కరోనా కేవలం మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ ను పాటించడం, వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే కరోనాను అంతం చేయగలమని ప్రభుత్వం స్పష్టం చేసింది.