- నన్నూ కూడా అరెస్ట్ చేయండి అంటూ ఆగ్రహం
- బెంగాల్ సీబీఐ ఆఫీసు ముందు టీఎంసీ కార్యకర్తల ఆందోళన .. ఉద్రిక్త పరిస్థితి
బెంగాల్లో నారదా కుంభకోణం రచ్చ మళ్లీ మొదలైంది. ఇటీవలే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం రాజకీయ హీటుతో రగిలిపోగా.. ప్రస్తుతం నారదా కుంభకోణం.. ఇద్దరు మంత్రుల అరెస్టు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా నారదా కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులులు ఇద్దరు మంత్రులు ఫర్హద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను అదుపులోకి తీసుకున్నారు.
దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బెంగాల్లోని సీబీఐ కార్యాలయం వద్దకు భారీగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తలు చేరుకున్నారు. ఏకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సీబీఐ కార్యాలయానికి వచ్చారు. దాదాపు 45 నిమిషాలకు పైగా అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే టీఎంసీ కార్యకర్తలు మంత్రుల ఆరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీబీఐ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.
సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఇద్దరు మంత్రులను అరెస్టు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పద్దతి అంటూ లేకుండా మంత్రులను అరెస్టు చేశారంటూ మండిపడ్డారు. తనను కూడా అరెస్టు చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, నారదా స్కామ్ కు సంబంధించి బీజేపీ నాయకులు సువేందు అధికారి సహా పలువురి నేతల హస్తం ఉందని ఆరోపణలు వినపిస్తున్నాయి. వీరితో పాటు పలువురు ఎంపీలు కూడా ఉండగా.. వారిని విచారణకు సీబీఐ కోరగా.. స్పీకర్ నుంచి ఇంకా అనుమతి రాలేదని సమాచారం.