- మాస్కులు ధరించని వారిపై 3,39,312 కేసులు
- భౌతిక దూరం పాటించని వారిపై 22,560 కేసులు
- మాస్కులు లేని వారి నుంచి మొత్తం రూ.31 కోట్ల వసూలు
- రాష్ట్ర హైకోర్టుకు డీజీపీ నివేదిక
తెలంగాణలో కరోనా కేసులు, మరణాలు, వైద్య సౌకర్యాలు సహా పలు అంశాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు కరోనా నేపథ్యంలో తాము తీసుకుంటున్న చర్యలను హైకోర్టుకు వివరించారు. రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆయా అంశాలకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించారు.
అందులోని వివరాల ప్రకారం.. ఈ నెల 1 నుంచి 14 వరకు కరోనా మహమ్మారి నిబంధనల ఉల్లంఘనల కింద మొత్తం 4,31,823 కేసులు నమోదు చేశారు. ఇందులో మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసులు నమోదయ్యాయి. వీరి నుంచి మొత్తం రూ.31 కోట్ల జరిమానా వసూలు చేశారు. అలాగే, భౌతిక దూరం పాటించని వారిపై 22,560 కేసులు నమోదయ్యాయి.
ఇక బ్లాక్ మార్కెట్లో ఔషధాల అమ్మకాన్ని నిరోధిస్తున్నామనీ, ఇప్పటికే 98 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో తాము పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు తీసకుంటున్నామని పోలీసు శాఖ కోర్టుకు తెలిపింది. కాగా, లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ అమలు తీరుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కేసులు, మరణాలు, వ్యాక్సినేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.