- హుజురాబాద్లో అడుగుపెట్టిన హరీష్ రావు.. ఏం చేయబోతున్నారు?
- టీఆర్ ఎస్ నేతలతో భేటీతో ఎలాంటి పరిణామలు జరగబోతున్నాయి?
- ఈటల అధికార పార్టీ పునాదులు కదిలించేనా?
గత కొంత కాలంగా టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్కు మధ్య దూరం పెరుగుతూ వస్తుందనే వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈటలను పార్టీ నుంచి దూరం పెట్టబోతున్నారంటూ తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈటల భూ కబ్జా వ్యవహారంతో ఇటీవల చోటుచేసుకున్న అనేక పరిణామల మధ్య ఈటలను మంత్రి వర్గం నుంచి సైతం తప్పించారు.
ఈ వ్యవహారంలో అధికారపార్టీ నేతలు ఆయనపై చేస్తున్న ఆరోపణలను ఈటల గట్టిగానే తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో ఈటల వర్సెస్ టీఆర్ ఎస్ నేతలు అనే విధంగా పోరు సాగుతోంది. అయితే, ప్రస్తుతం ఈటల సీఎం కేసీఆర్ను పూర్తిస్థాయిలో టార్గెట్ చేస్తూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో రెచ్చిపోతున్నారు. అటు క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల వేస్తున్న అడుగులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చే విధంగా సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈటలకు అడ్డుకట్ట వేసే బాధ్యతను ఈటల సమాజిక వర్గానికే చెందిన మంత్రి గంగుల కమలాకర్కు అధికార పార్టీ అప్పగించింది. దీంతో ఈటల వర్సెస్ గంగుల పోరు రాష్ట్రంలో రాజకీయ కాకపుట్టించింది. అయినప్పటికీ ఈటల.. గంగులతో పాటు ఆధికార పార్టీ సహా సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తున్న తనదైన స్టైల్లో ముందుకు సాగుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలతో పాటు ఆధికార పార్టీలో ఉండి తన వెంట వున్న వారితో వరుసగా భేటీ అవుతూ.. టీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలించడానికి సిద్ధమవుతున్నారు ఈటల.
అయితే, ఈటలను పార్టీకి దూరం చేస్తే జరిగే పరిణామాలు పెద్దగా ఉండవని అధికార పార్టీ అనుకున్నట్టుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ తాజాగా ఈటల దూకుడు సీఎం కేసీఆర్కు తలనొప్పిగా మారిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే చాల కాలం నుంచి కేసీఆర్తో పాటు ప్రభుత్వంలో ఉన్న ఈటల.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు, తప్పుడు నిర్ణయాలు సహా పలు అంశాలను గురించి ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారు.
ఈటలకు అడ్డుకట్ట వేయడంలో అడ్డుకట్ట వేయడంలో మంత్రి గంగుల కమళాకర్ తగిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయారు. దీంతో వ్యూహం మార్చిన సీఎం కేసీఆర్ ట్రబుల్ షూటర్గా పెరుగాంచిన మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపారు. తాజాగా హరీష్ రావు.. హుజురాబాద్ లో అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గం ప్రజా ప్రతినిధులతో భేటీ ఆయ్యారు. ప్రస్తుతం అక్కడ చోటుచేసుకుంటున్న రాజకీయాలపై చర్చించారు.
అయితే, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఎలాంటి క్లిష్ట పరిస్థతిలనైనా ఎదుర్కొంటూ సమస్యలను పరిష్కరిస్తూ దూసుకుపోయే నేతగా హరీష్ రావుకు పేరుంది. ఇదిలా ఉండగా, హరీష్, ఈటలకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈటల హరీష్ వర్గ నేత అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ! ఇలాంటి నేపథ్యంలో ఈటలకు అడ్డుకట్ట వేయడానికి సీఎం కేసీఆర్… హరీష్ రావును రంగంలోకి దింపడం ఆసక్తిగా మారింది. రానున్న రోజుల్లో చోటుచేసుకునే రాజకీయ ముఖచిత్రంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయమని తెలుస్తోంది ! క్షణక్షణానికి ఊహంకందకుండా మారే రాజకీయ పోరులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి !