విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెచ్ పీసీఎల్ పాత టెర్మినల్ లోని సీడీయూ (క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్) 3వ యూనిట్ లో పెద్ద మంటలతో దట్టమైన పొగలు అలముకున్నాయి. మొదట భారీ శబ్దం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో, ఏం జరిగిందో తెలియక హడలిపోయారు. ప్రస్తుతం హెచ్ పీసీఎల్ వద్ద భారీగా మంటలు, దట్టమైన పొగ ఎగిసిపడుతోంది.
కాగా, ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో హెచ్ పీసీఎల్ వర్గాలు మూడు సార్లు సైరన్ మోగించి కార్మికులను, ఇతర ఉద్యోగులను బయటికి పంపించివేశాయి.