Breaking
Sat. Jun 28th, 2025

య‌స్ తుఫాను బీభ‌త్సం

Cyclone Yaas
Cyclone Yaas

ద‌ర్వాజ-న్యూఢిల్లీ

య‌స్ తుఫాను బీభ‌త్సం కొన‌సాగుతోంది. బుధ‌వారం ఉద‌యం 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద తీరం దాటింద‌ని భారత వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డిన య‌స్ తుఫాను బెంగాల్‌, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. యస్ తుఫాను బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో తీవ్రమైన ఈదురు గాలుల‌తో విరుచుకుప‌డింది. దీంతో ల‌క్ష‌ల ఇండ్లు ధ్వంస‌మ‌య్యాయి. వేలాది చెట్లు నేలకొరిగాయి. వేలాది ఎక‌రాల్లో పంట‌ను న‌ష్ట ప‌రిచింది.

ఒడిశాలోని ధమ్రా ఓడరేవు సమీపంలో ఉదయం 9 గంట‌ల స‌మ‌యంలో తుఫాను గంటకు 130 నుంచి 150 కిలో మీట‌ర్ల వేగం ఈదురు గాలుల‌తో విరుచుకుప‌డింది. ఇక బెంగాల్‌లో దాదాపు కోటి మంది ప్ర‌జ‌లు ప్ర‌భావిత‌మ‌య్యార‌ని అధికారులు అంచ‌నా వేశారు. అలాగే, తుఫాను ధాటికి మూడు ల‌క్ష‌ల ఇండ్లు దెబ్బ‌తిన్నాయ‌ని వెల్ల‌డించారు. అధికారులు 15 ల‌క్ష‌ల‌కు పైగా మందికిని వ‌ర‌ద ముప్పు ప్రాంతాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌రలించారు. కోల్‌క‌తాలోని చాలా ప్రాంతాలను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. అక్క‌డి విమానాశ్ర‌యం సైతం మూత ప‌డింది.

దిఘాలోని సముద్ర తీరాలకు ఆనుకొని ఉన్న అనేక రహదారులు నీట మునిగాయి. మంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాల‌తో పాటు భద్రతా దళాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లిస్తున్నాయి. ఒడిశా లోని కోస్తా జిల్లాల్లో.. ముఖ్యంగా భద్రక్, కేంద్రపారా, మయూభంజ్, జాజ్ పూర్ ల‌లో భారీ వ‌ర్షాలు కురిశాయి. ప్ర‌స్తుతం తుఫాను ప్ర‌భావం బ‌ల‌హీన ప‌డిన‌ప్ప‌టికీ వ‌ర్ష‌పాతం గురువారం కూడా కొన‌సాగుతుంద‌ని ఐఎండీ తెలిపింది.

Related Post