యావత్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారిపై కొనసాగుతున్న పరిశోధనల్లో రోజుకో విషయం బయటపడుతూనే ఉంది. ఇప్పటికే లక్షలాది మందిని కరోనా బలితీసుకుంది. ఇప్పటికీ సునామీల విరుచుకు పడుతున్న కరోనా.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బారినపడ్డ వారిలో ఇప్పటికే దీర్ఘకాలం పాటు ఉపిరితిత్తుల సమస్యలు ఉంటున్నాయని పరిశోధనల్లో గుర్తించారు.
ఇక తాజాగా మెదడు, గుండె, మూత్రపిండాలపై కరోనా ప్రభావం చూపుతున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అలాగే, చర్మంపై దద్దుర్లు, రక్తస్రావ సమస్యలు కూడా తలెత్తుతున్నట్టు గుర్తించారు. కరోనా ఉధృతి కారణంగా పక్షవాతం, మెదడులోని ఇన్ఫ్లమేషన్, కండరాల రుగ్మతలకు సంబంధించిన కేసులు పెరిగే అవకాశముందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
కరోనా బారి నుంచి కోలుకున్న వారిలోనూ ఒత్తిడి, పొస్ట్ ట్రమాటిక్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటి సమస్యలు తలెత్తవచ్చునని ఇదివరకే పలు అధ్యయనాలు హెచ్చరించాయి. తాజాగా బ్రిటన్ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేపట్టారు. ఈ సందర్భంగా 30 మంది రోగుల్లో వాసన సామర్థ్యం తగ్గడం, బలహీనత వంటి లక్షణాలు కనిపించినట్టు గుర్తించారు. కరోనా రోగుల్లో న్యూరో సైకియాట్రిక్ లక్షణాలు అరుదేమీ కాదని పేర్కొన్నారు. కుంగుబాటు, ఆదుర్దా వంటి మానసిక సమస్యలు 25 శాతం మంది రోగుల్లో కనిపిస్తున్నట్టు పేర్కొన్నారు.