ఆనందయ్య కరోనా మందు పంపిణీ సోమవారం నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటగా కృష్ణపట్టణం నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఈ మందును అందించనున్నారు. రెండు వారాలుగా ఈ మందు పంపిణీ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కరోనా మందు పంపిణీ గురించి ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే ఆనందయ్య కరోనా మందుకు ఒకే చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. మందు పంపిణీని ఆన్ లైన్ లో పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వెబ్సైట్ ను కూడ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ మందు ఆఫ్లైన్ లోనే పంపిణీ చేయనున్నట్టు సమాచారం. మొదటగా సర్వే పల్లి నియోజకవర్గ ప్రజలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. ఆధార్ కార్డును పరిశీలించి మందును ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం విధించిన 144 సెక్షన్ కృష్ణపట్టణంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక ఆనందయ్య మందు పంపిణీకి సంబంధించి అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.