- యూరప్ను ముంచెత్తిన వరదలు
- జర్మనీలో 100కు పైగా మరణాలు. వేలాది మంది గల్లంతు
దర్వాజ-అంతర్జాతీయం
పశ్చిమ యూరప్ను వరదల ముంచేత్తాయి. అనేక ప్రాంతాలు నీట మునిగి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తప్పిపోయారు. ఒక్క జర్మనీలోనే వందకు పైగా మంది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వేయి మందికి పైగా తప్పిపోయారు. జర్మనీ స్థానిక మీడియా వివరాల ప్రకారం.. వరదల్లో 105 మంది మరణించారు. 1500 మంది తప్పిపోయారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిని భారీ వరదల దాటికి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వేల సంఖ్యలో ఇండ్లు నీటి మునిగిపోయాయి. వేలాది చెట్లు నేల కూలాయి. వేలాది హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. విద్యుత్ స్థంభాలు కూలిపోవడంతో.. అనేక గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి.
జర్మనీతో పాటు బెల్జియంలోనూ వరదల బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా ఇక్కడ భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తప్పిపోయారు. దాదాపు 20 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. వరదల్లో చిక్కుకున్న వారితో పాటు ప్రమాదం పొంచివున్న ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జర్మనీ, బెల్జియంలతో పాటు లగ్జంబర్గ్, నేదర్లాండ్స్ సహా పలు యూరప్ దేశాల్లో భారీ వర్షాల కారణంగా భయంకరమైన వరదల సంభవిస్తున్నాయి.