Breaking
Sat. Jun 28th, 2025

41 ఏండ్ల త‌ర్వాత‌..

India's historic bronze medal win in men's hockey 1
India's historic bronze medal win in men's hockey 1
  • దేశవ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు

ద‌ర్వాజ-న్యూఢిల్లీ

భార‌త పురుషుల హాకీ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. దాదాపు 41 ఏండ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ.. దేశ‌వ్యాప్తంగా సంబంరాన్ని నింపింది. టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత హాకీ జట్టు కాంస్య పత‌కం సాధించి చరిత్ర సృష్టించింది. జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 5-4తో విజయం సాధించి 41 సంవత్సరాల తర్వాత దేశానికి పతకం అందించింది.

గేమ్ ప్రారంభం నుంచి హోరాహోరీగా సాగింది. ఆట ఆరంభమైన రెండో నిమిషంలోనే ఒరుజ్‌ ఫీల్డ్‌ గోల్‌ కొట్టి జర్మనీని 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. భారత్‌పై ఒత్తిడి పెట్టాడు. దాంతో తొలి క్వార్టర్‌ను టీమ్‌ఇండియా 0-1తో ముగించింది. రెండో క్వార్టర్లో పోరు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అయితే, టీమ్‌ఇండియా దూకుడు పెంచి.. ఈ క్వార్టర్లో ఏకంగా మూడు గోల్స్‌ సాధించింది. 17వ నిమిషంలో అద్భుతమైన రివర్స్‌ హిట్‌తో జర్మనీ డిఫెన్స్‌ను ఛేదిస్తూ సిమ్రన్‌జీత్‌ ఫీల్డ్‌ గోల్‌ చేశాడు. స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే, భార‌త చిన్న చ‌న్న త‌ప్పిదాల కార‌ణంగా జ‌ర్మ‌నీ రెండు గోల్స్ కొట్టింది. మ‌ళ్లీ పుంజుకున్న భార‌త్ వ‌రుస‌గా రెండు గోల్స్ చేసింది. దీంతో స్కోర్ 3-3తో స‌మంగా అయింది.

మూడో క్వార్ట‌ర్ లోనూ భార‌త్ అదే దూకుడు కోన‌సాగించింది. సిమ్ర‌న్ జీత్ గోల్‌తో పాటు పెనాల్టీ స్ట్రోక్‌ను రూపిందర్‌ గోల్‌గా మలవడంతో భారత్‌ 5-3తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక చివ‌రి క్వార్ట‌ర్ లో జ‌ర్మ‌నీ ఓ గోల్ కొట్టి భార‌త్‌ను టెన్ష‌న్ పెట్టినా.. మ‌రో గోల్ జ‌ర్మ‌నీకి ల‌భించ‌కుండా భార‌త్ అడ్డుకోవ‌డంతో భార‌త్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

కొవిడ్‌ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్నిఅంకితం ఇస్తున్నామని హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. 41 ఏండ్ల క‌ల‌ నెరవేరడంతో మాటలు రావడం లేదనీ, ఆనందంతో భావోద్వేగానికి గురయ్యానని వెల్లడించాడు.

టోక్యో ఒలంపిక్స్ లో భార‌త హాకీ జ‌ట్టు మెడ‌ల్ గెల‌వ‌డంతో టీంకు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని మోడీ స‌హా దేశంలోని ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలిపారు. ప్ర‌ధాని మోడీ ఫోన్ చేసి టీం స‌భ్యుల‌తో మాట్లాడారు.

Related Post