దర్వాజ-న్యూఢిల్లీ
Chief Justice of India N. V. Ramana: దేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సహా వివిధ దర్యాప్తు సంస్థల తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా సీబీఐ సహా వివిధ దర్యాప్తు సంస్థలు స్పందిచడం లేదనీ, వారికి ఏమాత్రం సాయపడటం లేదని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలో ధన్బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఆటో ఢీ కొట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ.. దర్యాప్తు సంస్థలు నడుచుకుంటున్న తీరును తప్పుపట్టారు.
దేశంలోని సీబీఐ, ఐబీల తీరులో మార్పు రావడంలేదనీ, తమకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, తమ ప్రాణాలకు ప్రాణ హాని ఉందని న్యాయమూర్తులు ఫిర్యాదు చేసిన సరిగా స్పందించడం లేదంటూ సీజేఐ అన్నారు. ప్రస్తుతం ఇలాంటి అంశాలపై మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అలాగే, జడ్జి హత్య కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన చార్జిషీట్పై కూడా సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇలాంటి చార్జిషీట్ను ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించారు. చార్జిషీట్లో బలమైన సాక్ష్యాలను నమోదు చేయలేదని విమర్శించారు.