● తెల్లవారు జామున గుడిసె లోకి దూసుకెళ్లిన ట్రక్కు
● 8 మంది మృతి, పలువురికి గాయాలు
దర్వాజ-అహ్మదాబాద్
gujarat road accident: గుజరాత్లో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు వివరాల ప్రకారం.. గుజరాత్లోని అమ్రేలి జిల్లాలోని బద్దడా గ్రామంలో రోడ్డుకు సమీపంలోని ఉన్న ఓ గుడిసె లోకి ఓ ట్రక్కు దూసుకుపోయింది. తెల్లవారు జామునా 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో గుడిసెలో 10 మంది నిద్రిస్తున్నారు. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో 8, 13 ఏండ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలతో పాటు ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డ 3, 7 సంవత్సరాలున్న ఇద్దరు పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న సావర్ కుండ్లా పోలీస్ స్టేషన్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
ట్రక్కు రాజ్కోట్ నుండి అమ్రేలి జిల్లాలోని జాఫ్రాబాద్ వెళ్తుండగా.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం గుడిసెలోకి దూసుకుపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని అమ్రేలి పోలీసు సూపరింటెండెంట్ నిర్లిప్త్ రాయ్ తెలిపారు.