దర్వాజ-అంతర్జాతీయం
Algeria Fire Accident: ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కబైలియా రీజియన్లోని పలు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల నుంచి పౌరులను రక్షించడానికి సైన్యం రంగంలోకి దిగింది. వందలాది మందిని మంటల నుంచి కాపాడారు. కానీ మంటలు చుట్టుముట్టడంతో ఇప్పటివరకు 42 మంది చనిపోగా.. అందులో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
అల్జీరియాలోని దాదాపు 17 రాష్ట్రాల్లో మంటలు చెలరేగుతున్నాయి. అనేక గ్రామాలను మంటలు చుట్టుముట్టాయి. అడవుల్లో పశువులు, పక్షులు మంటలకు కాలిపోతున్న హృదయవిదారక దృశ్యాలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. కాగా, పలువురు దుండగులు కావాలని నిప్పు పెట్టడం వల్లే ఈ మంటలు చెలరేగుతున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి కమెల్ బెల్డ్జౌద్ ఆరోపించారు.