Breaking
Sat. Jun 28th, 2025

క‌రోనాతో అనాథ‌లైన ల‌క్ష మంది చిన్నారులు

1 lakh children lost one or both parents
1 lakh children lost one or both parents

తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్ల‌లు లక్షకు పైనే

సుప్రీంకోర్టుకు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్ వెల్ల‌డి

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

children lost parents: కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అన్ని దేశాల్లోనూ ఇప్పటికీ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంది. భారత్‌ కరోనా కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. కోట్లాది మంది వైరస్‌ బారినపడ్డారు. ఇదే సమయంలో వైరస్‌ వేలాది మంది చిన్నారులను అనాథలుగా మార్చింది. భారత్‌లో కరోనా మహమ్మారి సమయంలో ఒక లక్ష మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరిని కోల్పోయారని బుధవారం నాడు నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సీపీసీఆర్‌) దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది.

సుప్రీంకోర్టులో ఎన్‌సీపీసీఆర్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌ వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 2020 నుంచి ఈ ఏడాది ఆగస్టు 23 వరకు 10,132 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరిని కోల్పోయారు. 92,475 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారు. 8,161 మంది పిల్లలు అనాథలుగా మారారు. అలాగే, 396 మంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా వదలివేయబడ్డారు. అఫిడవిట్‌లో పేర్కొన్న మరణాల్లో కరోనా మరణాలతో పాటు ఇతర కారణాలతో కూడినవి కూడా ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్‌ పేర్కొంది.

ఈ డేటా ఎన్‌సీపీసీఆర్‌కు చెందిన బాల్‌ స్వరాజ్‌ పోర్టల్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అప్‌లోడ్‌ చేశాయి. ఇది చిన్నారుల సంరక్షణతో పాటు రక్షణ అవసరమైన పిల్లలను ట్రాక్‌ చేస్తుంది. ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లపై సుప్రీంకోర్టు సుమోటు కేసు ప్రతిస్పందనగా ఎన్‌సీపీసీఆర్‌ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోవిడ్‌-19 సమయంలో అనాథలుగా మారిన పిల్లలు కనీసం ప్రస్తుత విద్యాసంవత్సరం అయినా ప్రయివేటు పాఠశాలల్లో చదువును కొనసాగించేలా చూడాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

అటువంటి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజులో కొంత భాగాన్ని చెల్లించాలి లేదా ప్రయివేటు పాఠశాలలు పూర్తిగా ఆ విద్యార్థులకు ఫీజు మినహాయింపును ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. ఇలాంటి పిల్లల కోసం ముందుస్తు చర్యలు సైతం తీసుకోవాలని ప్రభుత్వాలను సుప్రీంకోర్టు సూచించింది. అలాగే, వీరి కోసం పీఎం కేర్స్ నిధిని సైతం ఉపయోగించే అంశాలను ప్రస్తావిస్తూ.. కేంద్రాన్ని ప్రశ్నించింది.

Related Post