Breaking
Sat. Jun 28th, 2025

మండే అగ్నికణం.. భగత్ సింగ్

Mann Ki Baat, Chandigarh airport, Shaheed Bhagat Singh, PM Modi, మన్ కీ బాత్, చండీగఢ్ విమానాశ్రయం, షహీద్ భగత్ సింగ్, ప్రధాని మోడీ
BhagatSingh

దర్వాజ-హైదరాబాద్

Bhagat Singh: ఏ జాతి అయితే తన శక్తిని, చరిత్రను మరిచిపోతుందో.. అది తన స్వార్థం కోసం, మతం కోసం, ఈర్ష్యాద్వేషాలతో పరస్పరం కాట్లాడుకుంటుంది. అనైక్యతకులోనై.. ఐక్యతబలం కోల్పోయి.. పతనందిశగా ముందుకుసాగుతుంది. ఇలాంటి కార‌ణాల వల్లనే భారత్ వేల సంవత్సరాల కిందట ముస్లీంల చేతిలోకి.. రెండు వందల ఏండ్లకు పైగా ఆంగ్లేయుల చేతిలో బానిసైంది.

భారత్ లో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్న రోజులవి… బ్రిటీష్ వారి కర్కష పాలన, ప్రజల అణచివేత, దోపిడి కొనసాగుతున్న పరిస్థితులు. అలాంటి సమయంలో భారతమాత దాస్యశృంఖలాలను తెంచి విముక్తి కల్పించడానికి.. ఒక వైపు కాంగ్రెస్ మహానేతలు శాంతియుత పోరాటం సాగిస్తుండగా.. మరోవైపు సాయుధ పోరాటం ద్వారా భారత జాతికి విముక్తి కల్పించడానికి కొంత మందితో కూడిన యువరక్తం ఉరకలేసింది. అలాంటి యువ స్వతంత్య్రా సమరయోధుల్లో జ్వలించే నిప్పుకణికలా.. మండే అగ్నిగోళంలా.. రెపరెపలాగే విప్లవ పతాకలా.. ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన అగ్గిపరాట షాహీద్ భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ 23 ఏండ్ల వయస్సులోనే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ఉరి కొయ్యను ముద్దాడిన భరత జాతి ముద్దుబిడ్డ భగత్ సింగ్.

1931 మార్చి 23న భగత్ సింగ్ తో పాటు ఆయన స్నేహితులైన స్వతంత్ర్య సమరయోధులైన సుఖ్ దేవ్, రాజ్ గురులను నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం వరుసగా నిల్చోబెట్టి ఉరి తీసింది. ఉరికంబం ముందు నిల్చుని సైతం ఆంగ్లేయులపై వీరు గర్జించారు. అంతలా బ్రిటీష్ గుండెల్లో గుబులును భగత్ సింగ్ ఎలా పుట్టించగలిగాడు? భారత భావి తరలకు ధైర్య సాహసాలను ఎలా అందించగలిగాడు? అసలు భగత్ సింగ్ బాల్యాన్ని అంతలా ప్రభావితం చేసిన అంశాలేంటి?

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్.. భగత్ సింగ్ స్వగ్రామం. 1907, సెప్టెంబరు 28న సిక్కు కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్‌పై బాగా ఉండేది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ సింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. అప్పుడే ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా గర్జించాడు. అయితే గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా, హింసాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్ వారి ఆగడాలకు అడ్డుక‌ట్ట వేయాల‌నే ఆలోచనలో భ‌గ‌త్ సింగ్ ఉండేవాడు.

1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రజా హక్కులను హరించే మీసా చట్టం సైతం ఈ ఆందోళనల ఉధృతికి కారణమైంది. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ లో నిరసనలు ప్రచండరూపం దాల్చాయి. 1919 ఏఫ్రిల్ 12న అమృత్ సర్ లో పెద్ద ర్యాలీ తీశారు. పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడ ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తర్వాత వైశాఖీమేళ రోజున జలియన్ వాలాబాగ్ అనే మైదానంలో సభ ఏర్పాటుచేశారు. సాయంత్రం సభ ప్రారంభానికి ముందే వేలాది మందితో మైదానం కిక్కిరిసిపోయింది.

అకస్మాత్తుగా మైదానం రెండు ప్రవేశమార్గాల నుంచి బ్రిటీష్ పాలకులు కాల్పులకు తెగబడ్డారు. తొక్కిసలాట జరిగింది. భయటపడే మార్గమూ లేదు. వందలాది మంది రక్తపు మడుగులో పడివున్న భయంకర దృశ్యాలు గురించి ఎంతవర్ణించినా తక్కువేనని అందులో పాలుపంచుకున్న యోధులు పేర్కొన్నారు. కాల్పుల కారణంగా అక్కడికక్కడే 379 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భగత్ సింగ్ లో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. అప్పటికీ భగత్ సింగ్ దయానంద్ ఆంగ్లో వైదిక్ స్కూల్ లో విద్యార్థి.

యుక్త వయసుకు వచ్చాక లాహోర్‌లోని నేషనల్ కాలేజీలో చేరాడు. ఆ స‌మ‌యంలో పెండ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ సింగ్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ ఉత్తరంలో ’నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదు‘ అని రాశాడు. ఇంటి నుంచి పారిపోయి భగత్ సింగ్.. నవ జవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులను స్వాతంత్య్రోద్యమంలో పాలు పంచుకునేలా ప్రొత్సహించాడు. ఆ తర్వాత హిందూస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే అతనికి సుఖ్ దేవ్ పరిచయమయ్యాడు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు.

అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమకారులు హోరెత్తిస్తున్నారు. అందులో భాగంగా లాహోర్‌లో లాలాలజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్‌గా సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్ పై విరుచుకుపడ్డాడు. తల పగలగొట్టాడు, ఛాతీపైనా గాయమంది. దీంతో పంజాబ్ కేసరి నేల కొరిగాడు.

లాలా లజపతిరాయ్ మరణం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులలో ఆగ్రహాన్ని మరింతగా పెంచింది. దీంతో పోలీసు స్టేష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి మరీ.. సైకిల్‌పై వ‌స్తున్న సాండర్స్ కసి తీరా కాల్చి చంపారు. అయితే, హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి భయపడని భగత్ సింగ్.. హత్య చేసింది ఏవ‌రూ? ఎందుకు ఈ హ‌త్య చేశామ‌నేది వివ‌రిస్తూ.. క‌ర‌ప్ర‌తాలు సైతం పంచ‌డంతో పాటు వాటిని ప్ర‌ధాన వీధుల్లో గోడ‌ల‌పై అతికించాడు.

ఈ ఘటన తర్వాత 1929లో ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను, కార్మిక హ‌క్కుల‌ను హ‌రించే ప‌బ్లిక్ సేప్టీ బిల్‌, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్‌ల‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. అయితే, విప్ల‌వ వీరులు స‌భ ప్రారంభానికి ముందే ప్రేక్ష‌కుల స్థానంలో కుర్చుని ఉన్నారు. స‌మావేశం ప్రారంభ‌మైన త‌ర్వాత ఆ బిల్లుల‌కు ఆమోదం తెలిపే స‌మ‌యంలో అసెంబ్లీపై బాంబులు విసిరారు. అంద‌రూ తేరుకున్నాక..
విప్ల‌వం వ‌ర్థిల్లాలి !
సామ్రాజ్య‌వాదం న‌శించాలి!
ప్ర‌పంచ కార్మికులారా ఐక్యం కండి

అంటూ నినాదాలు చేస్తూ.. అసెంబ్లీ హాలులో గ‌ర్జించారు. క‌ర‌ప‌త్రాల‌తో అసెంబ్లీ హాలు నిండిపోయింది. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశ బహిష్కరణకు గురయ్యారు. వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపడం.. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్‌దేవ్‌లు నేరాన్ని అంగీకరించడంతో కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది.

ఉరి కంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్ సింగ్ తన త‌ల్లితో ‘నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే భారత త‌ల్లులంద‌రూ తమ బిడ్డలు భగత్ సింగ్‌లా కావాలని కోరుకుంటారు. స్వాతంత్య్ర కాంక్షతో అనేక మంది సమరయోధులు పుట్టుకొస్తారు. అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్ట శక్తులకు సాధ్యం కాదు అని అన్నాడు.

దీనికి భగత్ సింగ్ తల్లి.. “ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా వుంటుంది అంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకుంటుంది” అని అన్నారు. ఉరికొయ్య‌ను ముద్దాడుతూ.. భ‌గ‌త్ సింగ్, రాజ్‌గురు, సుక్‌దేవ్‌లు ప‌లికిన చివ‌రి మాట‌లు ఇక్విలాబ్ జిందాబాద్‌..
ఇలా భ‌రతమాత దాస్యశృంక‌లాలు తెంచడంలో ఎంతో మంది తమ వంతు పాత్ర పోషించారు.

అయితే, ఎంతో మంది పొరాడి, ప్రాణాలర్పించి సాధించుకున్న స్వతంత్ర భారతంలో ఇప్పటికీ.. గతంలో శ్రీ శ్రీ చెప్పిన మాటలు సరిపోతాయి.

అవినీతి బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటుదిగజారదు?
కాంచవోయి ఈ దుస్థితి
ఎదరించవోయి ఈ పరిస్థితి..

జైహింద్..

https://darvaaja.com/huzurabad-by-election/

కుండ‌పోత వ‌ర్షం.. నీట‌మునిగిన హైద‌రాబాద్

భార‌త్ బంద్

పెగాస‌స్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మ‌మ‌త ఫైర్

బాలిక‌పై 30 మంది లైంగిక‌దాడి

ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

పంజా విసురుతున్న డెంగ్యూ

Related Post