• టాప్-10 జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు
• స్విట్జర్లాండ్కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఐక్యూఎయిర్ నివేదిక వెల్లడి
• ఢిల్లీ కాలుష్య నివారణపై ఏం చర్యలు తీసుకున్నారు.. లాక్డౌన్ అంశం పరిశీలించండి: సుప్రీంకోర్టు
దర్వాజ-న్యూఢిల్లీ
Air Pollution: మానవ అవసరాలు, మౌలికసదుపాయాల కల్పన.. అభివృద్ధి వంటి కారణాల పేరిట ప్రకృతి విధ్వంసం కొనసాగుతుండటం కారణంగా వాతావరణం అనేక మార్పులకు లోనవుతున్నది. మరీ ముఖ్యంగా గాలి కాలుష్య ఉద్గారాలు రికార్డు స్థాయిలో వాతావరణంలోకి వదులుతుండటంతో భూతాపం పెరుగుతున్నది. దీంతో మానవులతో పాటు భూమిపై ఉన్న అనేక జీవజాతుల మనుగడ ప్రమాదంతో పడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రపపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను స్విట్జర్లాండ్కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఐక్యూఎయిర్(IQAir) ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం..
ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలు..
క్రమ సంఖ్య | నగరం-దేశం | ఏక్యూఐ |
1 | ఢిల్లీ-భారతదేశం | 556 |
2 | లాహోర్-పాకిస్థాన్ | 354 |
3 | సోఫియా- బల్గేరియా | 178 |
4 | కోల్కతా, భారతదేశం | 177 |
5 | జాగ్రెబ్, క్రొయేషియా | 173 |
6 | ముంబయి, భారతదేశం | 169 |
7 | బెల్గ్రేడ్, సెర్బియా | 165 |
8 | చెంగ్డు, చైనా | 165 |
9 | స్కోప్జే, ఉత్తర మాసిడోనియా) | 164 |
10 | క్రాకో, పోలాండ్ | 160 |
ఈ నివేదిక వివరాల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత గాలి కాలుష్య నగరాల్లో దేశరాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. టాప్-10 కాలుష్య నగరాల్లో భారత్ నుంచి 3 నగరాలు ఈ జాబితాలో ఉండటం ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. టాప్-10 కాలుష్య నగరాల్లో భారత్ నుంచి ఢిల్లీ తో పాటు ముంబయి, కోత్కతాలు కూడా ఉన్నాయి. ఆయా నగరాల్లో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతున్నదని నిపుణులు అందోళన వ్యక్తంచేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే దీని ప్రభావం పెరిగి.. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న వారిపైనే కాకుండా యావత్ ప్రపంచ జీవులపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మానవ మనుగడ సాఫీగా ముందుకు సాగాలంటే ప్రకృతి విధ్వంసం ఆపాలనీ, కాలుష్య ఉద్గారాల తగ్గించే చర్యలు తీసుకోవాలని పిలుపునిస్తున్నారు.
కాలుష్యం.. లాక్డౌన్ విధించే అంశం పరిశీలించండి:సుప్రీంకోర్టు
దేశంలో కాలుష్యం పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు కేంద్రానికి పలు సూచనలు చేసింది. కాలుష్యం తగ్గింపునకు వెంటనే అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఎలా బతుకుతారంటూ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ పేర్కొంది. రాజధానిలో కాలుష్యానికి.. వ్యవసాయ పంట వ్యవర్థాలను కాలుస్తున్నారనీ రైతులపై పడటం కాదు.. బాణసంచా నిషేధం ఎంతమేర అమలైందో ఆలోచించుకోవాలంటూ చురకలంటించింది.
ఇదిలావుండగా, ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయి (ఏక్యూఐ) 476గా ఉందనీ, ఇది తీవ్రమైన కేటగిరీలోకి వస్తుందని కాలుష్య బోర్డు హెచ్చరించింది . రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేయడం, ప్రయివేటు కార్లపై ‘బేసి-సరి’ విధానం అలాగే, అన్ని నిర్మాణాలను నిలిపివేయడం వంటి అత్యవసర చర్యలను అమలు చేయాలంటూ సూచించింది. దేశంలో గాలి నాణ్యత పడిపోయిన నగరాల్లో లంద్షహర్, హాపూర్, నోయిడా, మీరట్, ఘజియాబాద్, జైపూర్, ఉదయపూర్, అజ్మీర్, పుష్కర్ ఉన్నాయి. ఆయా ప్రాంతాలో ఆందోళనకర స్థాయిలో గాలినాణ్యత పడిపోయింది.