Breaking
Sat. Jun 28th, 2025

Telangana | వ‌రిధాన్యం కొనుగోలు..కేసీఆర్ పన్నిన కొత్త కుట్ర ఇది : బండి సంజ‌య్

bandi sanjay
bandi sanjay

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్‌

Bandi Sanjay Kumar : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు చేస్తోందని, దళారులకు వందల కోట్లు కాజేసి రైతుల ఆగ్రహాన్ని కేంద్రం వైపు మళ్లించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. యాసంగి (రబీ) సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేయడం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దళారులకు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరకు విక్రయించాల్సిన అనివార్య పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని తెలంగాణ రైతాంగానికి రాసిన బహిరంగ లేఖలో సంజయ్ అన్నారు. రైస్‌మిల్లర్ల మాఫియాతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పన్నిన కుట్ర ఇదని ఆరోపించారు.

రబీ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేయడం కేసీఆర్ ప్రభుత్వ పెద్ద కుట్రలో భాగమేనన్నబీజేపీ అధ్యక్షుడు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తుండటంతో టీఆర్‌ఎస్ నేతలు రోడ్డెక్కుతున్నారని మండిపడ్డారు. రబీ సీజన్‌లో వరి క్వింటాల్‌కు రూ.1,960 ఎంఎస్‌పీని కేంద్రం చెల్లిస్తుందని తెలిపారు. ఇప్పటికే రైతులు పంట కోతలు ప్రారంభించగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ వంటి పలు జిల్లాల్లో రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారు.

తమ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించకపోవడం వల్ల రైతులలో తీవ్ర అశాంతి నెలకొంటుందని, అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దారి తీస్తుందని గ్రహించిన కేసీఆర్ మద్దతుతో అధికార టీఆర్‌ఎస్ నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం ద్వారా పెద్ద డ్రామాను ప్రారంభించార‌ని బండి సంజ‌య్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని అనుసరిస్తోందనీ, ఈ సంవత్సరం కూడా, తెలంగాణ విషయంలో అదే విధానాన్ని అనుసరిస్తోందని తెలిపారు.

“ఈ ఏడాది ఫిబ్రవరి 25న అన్ని రాష్ట్రాలతో కేంద్రం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఎంత బియ్యం సరఫరా చేస్తుందనే వివరాలను సమర్పించలేదు. కేంద్రమే స్వయంగా వరి ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గుచేటని” బండి సంజ‌య్ అన్నారు.

Related Post