దర్వాజ-న్యూఢిల్లీ
COVID-19 vaccine : కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాక్సిన్ ధర భారీగా తగ్గింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), భారత్ బయోటెక్ లు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రయివేటు ఆస్పత్రులకు అందించే కోవిడ్-19 వ్యాక్సిన్ల ముందు జాగ్రత్త డోసుల ధరలను ఒక్కో షాట్కు రూ. 225కి తగ్గించాలని నిర్ణయించినట్లు శనివారం తెలిపారు.
“కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత, ప్రయివేటు ఆస్పత్రుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను ఒక్కో డోస్కు రూ. 600 నుండి రూ. 225కి సవరించాలని సీరం (SII) నిర్ణయించిందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము” అని SII CEO అదార్ పూనావాలా ఒక ట్వీట్లో తెలిపారు. COVID-19కి వ్యతిరేకంగా తన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ముందు జాగ్రత్త మోతాదు అర్హత ఉన్న వ్యక్తులకు షాట్కు రూ. 600గా నిర్ణయించబడుతుందని అంతకు ముందు శుక్రవారం తెలిపిన సంగతి తెలిసిందే.
భారత్ బయోటెక్ కో-ఫౌండర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ఒక ట్వీట్లో ఇలా అన్నారు: “పెద్దలందరికీ ముందు జాగ్రత్త మోతాదు అందుబాటులో ఉంచాలనే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ ధరను ఒక్కో డోసుకు రూ.1,200 నుండి రూ.225కి తగ్గించాలని మేము నిర్ణయించుకున్నాముు” అని వెల్లడించారు.
కాగా, ప్రభుత్వాన్ని కోవిడ్-19 వ్యాక్సిన్లు అందిస్తున్న అతిపెద్ద సరఫరాదారులుగా సీరం (SII), భారత్ బయోటెక్లు ఉన్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు రెండో డోస్ ఇచ్చిన తర్వాత తొమ్మిది నెలలు పూర్తయిన వారు ముందుజాగ్రత్త మోతాదుకు అర్హులని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటివరకు భారతదేశంలోని 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 96 శాతం మంది కనీసం మొదటి డోసు టీకా తీసుకున్నవారు ఉన్నారు. మొత్తంగా 83 శాతం మంది రెండు డోస్లు తీసుకున్నారని రిపోర్టు పేర్కొంటున్నాయి.
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడిన వారికి కూడా 2.4 కోట్ల కంటే ఎక్కువ ముందు జాగ్రత్త కోవిడ్ టీకా డోసులు అందించారు. అంతేకాకుండా, 12-14 సంవత్సరాల వయస్సు గల 45 శాతం మంది లబ్ధిదారులు మొదటి డోస్ను పొందారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా కొనసాగుతున్న ఉచిత COVID-19 టీకాలు వేసే కార్యక్రమం అర్హులైన జనాభాకు మొదటి మరియు రెండవ డోస్తో పాటు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులు మరియు 60 ఏళ్లు పైబడిన వారికి ముందస్తు జాగ్రత్త మోతాదులను వేగవంతం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.