Covid-19: ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. భారత్ లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ఆందోళనలు తప్పదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతున్నది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,688 మంది కరోనా వైరస్ మహమ్మారి బారినపడ్డారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,75,864 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కరోనా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా అధికం అవుతోంది. కొత్తగా దేశంలో 50 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,23,803 కు పెరిగింది.
దేశంలో ప్రస్తుతం 18,684 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా 2,755 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా ఇప్పటివరకు 4,25,33,377 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతంగా, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు రేటు 1.22 శాతంగా ఉంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లు టాప్ లో ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు 1,88,89,90,935 కరోనా టీకా డోసులను ప్రజలకు అందించారు. అందులో మొదటి డోసుల సంఖ్య 91.4 కోట్లు ఉండగా, రెండు డోసుల తీసుకున్నవారి సంఖ్య 81.1 కోట్లుగా ఉంది.