దర్వాజ-న్యూఢిల్లీ
Coronavirus fourth wave : కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఇప్పటికే లక్షలాది మంది చనిపోగా, కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. ప్రపంచంలోని పలు దేశాలతో పాటు భారత్ లోనూ మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కోవిడ్-19 ఫోర్త్ వేవ్ భయాలు అధికం అవుతున్నాయి. వరుసగా ఐదో రోజు దేశంలో మూడు వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 3157 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,30,82,345 కు చేరుకుంది. కొత్తగా 2723 మంది రోగుల కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ రికవరీల సంఖ్య 4,25,38,976 కు పెరిగింది.
మరణాలు సైతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 26 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 5,23,843 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 19,500 కు చేరుకున్నాయి. గా, దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు, మరణాలు అధికంగ నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి.
కాగా, కరోనా వైరస్ మహమ్మారి కేసులు పెరుగుదలపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలో రోజువారీ కోవిడ్ -19 కేసుల సంఖ్యలో ప్రస్తుత పెరుగుదలను మహమ్మారి నాల్గవ వేవ్ గా పేర్కొనలేమని ICMR అదనపు డైరెక్టర్ జనరల్ సమీరన్ పాండా అన్నారు.