దర్వాజ-న్యూఢిల్లీ
Rajasthan : రాజస్థాన్లోని జోధ్పూర్ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జోధ్పూర్లో కొనసాగుతున్న కర్ఫ్యూను.. నగరంలోని 10 ప్రాంతాలలో మార్చి 8 ఉదయం 12 గంటల వరకు పొడిగించారు. ఈద్ సందర్భంగా మతపరమైన హింస చెలరేగినప్పటి నుండి నగరం కర్ఫ్యూలో ఉంది. ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనక పోవడంతో కర్ఫ్యూను పొడిగిస్తూ జిల్లా పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. “ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ పొడిగించబడింది. జోధ్పూర్ కమిషనరేట్ ప్రాంతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 144 మే 8 అర్ధరాత్రి 12:00 వరకు అమల్లో ఉంటుంది” అని ఉత్తర్వుల్లో పెర్కొన్నారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఉపాధ్యాయులకు, వైద్య సేవల్లో నిమగ్నమైన సిబ్బంది, బ్యాంకు అధికారులు, న్యాయ అధికారులు, మీడియా సిబ్బందికి కూడా సెక్షన్ 144 నుంచి మినహాయింపు ఇచ్చారు. కాగా, ఈద్కు ముందు రాజస్థాన్లో ఘర్షణలు చెలరేగాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో సోమవారం రాత్రి ఈద్కు ముందు జలోరీ గేట్ ప్రాంతంలో రెండు వర్గాలకు చెందిన వారు తమ జెండాలు ఎగురవేయడంపై వివాదం చెలరేగిందని పోలీసులు తెలిపారు. మొదట వాగ్వివాదంతో మొదలైన.. ఘర్షణకు దారి తీసిందని తెలిపారు. ప్రస్తుతం జోధ్పూర్లో మూడు రోజుల పరశురామ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈద్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు వర్గాలు పెట్టిన మతపరమైన జెండాలు ఘర్షణలకు దారితీశాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.