దర్వాజ-అంతర్జాతీయం
Sri Lanka economic crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే మరోసారి శ్రీలంక ఎమర్జెన్సీలోకి వెళ్లింది. భారీ ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య.. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే శుక్రవారం అర్ధరాత్రి నుండి దేశంలో అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు వెల్లువెత్తుతున్న తరుణంలో ఐదు వారాల్లో రెండో సారి దేశంలో గోటబయా ఎమర్జెన్సీ విధించారు. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
కాగా, ఆర్థిక సంక్షోభంపై శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం శ్రీలంక పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, జల ఫిరంగులను ప్రయోగించారు. దేశ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విఫలమైన అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, అధికార పక్షం రాజీనామా చేయాలని డిమాండ్ తో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు అధ్యక్షుడు గోటబయ రాజపక్సేను తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాని మహింద రాజపక్సే నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
