దర్వాజ-న్యూఢిల్లీ
Covid-19 : భారత్ లోనూ గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో కోవిడ్-19 ప్రభావం పెరుగుతున్నదని ప్రస్తుతం నమోదవుతున్న కేసుల గణాంకాలు పేర్కొంటున్నాయి. రోజువారీ కరోనా వైరస్ కొత్త కేసులు 4 వేలకు చేరువయ్యాయని శనివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
4 వేలకు చేరువగా కొత్త కేసులు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్ లో కొత్తగా 3,805 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య మొత్తం 4,30,98,743కి చేరుకుంది. ఇదే సమయంలో కోవిడ్ -19 సంక్రమణ కారణంగా 22 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,024కు పెరిగింది.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు
దేశంలో యాక్టివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 20,303 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇది మొత్తం కేసులలో 0.05 శాతంగా ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 3,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4,25,54,416 కు చేరుకుంది.
ఒకే రోజు 4,87,544 కరోనా పరీక్షలు
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను పెంచుతున్నామని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత 24 గంటల్లో 4,87,544 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తంగా 84,03,32,469 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.78 శాతంగా నమోదైందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వీక్లీ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా ఉంది.
190 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ సైతం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివకు దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 190 కోట్ల వ్యాక్సిన్ డోస్లను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో మొదటి డోసుల సంఖ్య 91.5 కోట్లు ఉండగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 81.5 కోట్లుగా ఉంది.

కరనా కేసులు, మరణాలు ఈ రాష్ట్రాల్లో అధికం..
భారత్ కరోనా వైరస్ కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ లో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లు ఉన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టులను ఖండించిన భారత్
దేశంలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 5,24,024 గా ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. కానీ భారత్ లో కరోనా వైరతో పోరాడుతూ 4.7 మిలియన్లకు పైగా ప్రజలు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ రిపోర్టులను భారత్ ఖండించింది.