Breaking
Sat. Jun 28th, 2025

Women’s World Boxing Championships: ఫైనల్‌కు చేరిన నిఖత్ జరీన్.. కాంస్య పతకాలతో మనీషా, పర్వీన్..

India's Nikhat Zareen Wins Gold At Women's World Boxing Championships
India's Nikhat Zareen Wins Gold At Women's World Boxing Championships

దర్వాజ-న్యూఢిల్లీ

Nikhat Zareen: ట‌ర్కీలోని ఇస్తాంబుల్ వేదిక‌గా జ‌రుగుత‌న్న ప్ర‌పంచ మ‌హిళా బాక్సింగ్ ఛాంపియ‌న్‌షిప్ లో భార‌త బాక్స‌ర్లు స‌త్తా చాటుతున్నారు. బుధవారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన నిఖత్ జరీన్ (52 కేజీల విభాగం) బ్రెజిల్‌కు చెందిన కరోలిన్ డి అల్మెయిడాపై అద్భుత‌మైన విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

నిఖత్ తన బ్రెజిల్ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించి 5-0తో విజయం సాధించింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత ఇటలీకి చెందిన ఇర్మా టెస్టా చేతిలో మనీషా అదే తేడాతో ఓడిపోయింది. కాగా, పర్వీన్ హుడా (63 కేజీల విభాగం) ఐర్లాండ్‌కు చెందిన అమీ బ్రాడ్‌హర్స్ట్‌తో 1-4తో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది. మాజీ జూనియర్ ప్రపంచ ఛాంపియన్ అయిన జరీన్, 52 కేజీల పోటీలో చివరి-నాలుగు బౌట్‌లో ఏకగ్రీవ నిర్ణయంతో 5-0 తేడాతో తన ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.

2019 ఆసియా ఛాంపియన్‌షిప్‌ల కాంస్య పతక విజేత మనీషా తన రెండవ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీ పడుతోంది. తన పవర్ పంచ్‌లతో త‌న‌కంటే ర్యాంకులో ముందున్న ప్రత్యర్థిని అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నించింది, అయితే టెస్టా అద్భుతంగా డిఫెండ్ చేసింది.

ఇదిలావుండ‌గా, ఆరుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఎంసీ మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్ మరియు లేఖా సి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళా బాక్సర్లు కాగా, ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన నిఖ‌త్ జరీన్ సైతం వారి స‌ర‌స‌న చేరేందుకు అడుగుదూరంలో ఉంది. 2006లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో సహా ఎనిమిది పతకాలను కైవసం చేసుకోవడంతో ఈ ఈవెంట్‌లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. గత ఎడిషన్‌లో, నలుగురు భారతీయ బాక్సర్లు పతకాలతో స్వదేశానికి తిరిగి వచ్చారు.

Related Post