దర్వాజ-అమరావతి
Konaseema protest: ఆంధప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పేరు మార్చడంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమలాపురంలో ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ, 144 సెక్షన్ను అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా జిల్లా పేరును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కోనసీమ వాసులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమలో ఆందోళనలు చేపట్టారు. అమలాపురంలో ప్రజాప్రతినిధుల ఇళ్లను ఆందోళనకారులు ముట్టడించిన ఘటన కలకలం రేపింది. మరోవైపు అమలాపురం విధ్వంసం వెనుక ఉన్న శక్తులన్నింటినీ బయటకు తీస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అమలాపురం విధ్వంసంపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమలాపురంలో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు.