Mosque Row: జ్ఞానవాపి తర్వాత మంగళూరు పాత మసీదుపై వివాదం !
దర్వాజ-బెంగళూరు
Mangalore Old Mosque : ఉత్తరప్రదేశ్ లోని జ్ఙానవాపి మసీదు లోపల శివలింగం ఉందనే వివాదం తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇంకా జ్ఙానవాపి మసీదు వివాదం ఓ కొలిక్కి రాకముందే కర్నాటకలో మరో మసీదు వివాదం తెరమీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని జ్ఙానవాపి మసీదు మాదిరిగానే కర్నాటకలోని మంగళూరు పాత మసీదు పై వివాదం రాజుకుంది. అక్కడ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
ఇటీవల మంగుళూరు లో ఉన్న పాత మసీదు పునరుద్దరణ పనులు జరిగాయి. ఈ క్రమంలోనే మసీదు హిందూ దేవాలయం లాంటి నిర్మాణ డిజైన్ కనుగొనబడినట్లు వార్తలు వినిపించాయి. దీంతో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పూజలు చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలోనే ఆలయం చుట్టూ పోలీసు భద్రతను పెంచారు. మంగళూరు పాత మసీదు ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 500 మీటర్ల పరిధిలో గుమికూడేందుకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ చేశారు.
పాత మసీదు వివాదం ఇలా షురు అయింది..
పాత మసీదు పునరుద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు మే 21న మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందని పలువురు పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. విశ్వహిందూ పరిషత్ ఈ మొత్తం అంశాన్ని లేవనెత్తడంతో రచ్చ మొదలైంది. ఇప్పుడు జ్ఞానవాపి లాగే మంగళూరు పాత మసీదు వివాదం రాజుకుంది.ఆలయాన్ని కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని వీహెచ్పీ ఆరోపిస్తోంది. మసీదులో సర్వే చేయాలని హిందూ సంస్థ డిమాండ్ చేస్తోంది.
Share this content: