దర్వాజ-న్యూఢిల్లీ
Arvind Kejriwal: పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య దురదృష్టకరమని, అయితే దాని చుట్టూ రాజకీయాలు చేయవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్లో ఎలాంటి సంఘటనలు జరిగినా వాటి చుట్టూ రాజకీయాలు ఉండకూడదని తాను నమ్ముతున్నానని అన్నారు. సిద్ధూ మూస్ వాలా హత్యకు గురికావడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఎస్టీపీని సందర్శించిన సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. “పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇప్పటికే తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నిందితులను త్వరలో అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు” అని కేజ్రీవాల్ అన్నారు.
కాగా, పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు, గాయకుడు సిద్ధూ మూస్ వాలాను (Sidhu Moosewala ) గుర్తు తెలియని వ్యక్తులు మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో కాల్చి చంపారు. జీపులో వెళ్తుండగా ఆయనపై 20 రౌండ్ల కాల్పులు జరిపారు. సిద్దూకు సంబంధించి భద్రతను ఉపసంహరించుకున్న ఒకరోజు తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. హత్యకు కారణం ఆప్ అని ఆరోపిస్తున్నాయి.