దర్వాజ-న్యూఢిల్లీ
Presidential election: భారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు దాదాపు 4,800 మంది ఎంపీలు-ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయనున్నారు. జూలై 18న (సోమవారం) రాష్ట్రపతి ఎన్నికల బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు నిలిచారు. జూలై 21న ఓట్ల లెక్కింపు, జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపింది. ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దించాయి. అయితే, ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై స్పష్టమైన ఆధిక్యాన్ని కలిగి ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అమెకు మద్దతు ప్రకటించిన సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఆమెకు అనుకూలంగా 60 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. పార్లమెంట్ హౌస్, రాష్ట్ర శాసనసభలలో పోలింగ్ జరుగనుంది. జూలై 21న పార్లమెంట్ హౌస్లో ఓట్ల లెక్కింపు, జూలై 25న తదుపరి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేడీ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, టీడీపీ, జేడీ(ఎస్), శిరోమణి అకాలీదళ్, శివసేన, ఇప్పుడు జేఎంఎం వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ముర్ము ఓట్ల శాతం దాదాపు మూడింట రెండు వంతులకు చేరుకునే అవకాశం ఉంది. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన మొట్టమొదటి గిరిజన మహిళ, రెండో మహిళా రాష్ట్రపతిగా చరిత్రి సృష్టించనుంది. మొత్తం 10,86,431 ఓట్లలో వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు తర్వాత నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అభ్యర్థికి ఇప్పుడు 6.67 లక్షల ఓట్లు వచ్చే అవకాశముంది.
రాష్ట్రపతి ఎన్నిక విధానం
దామాషా ప్రాతినిధ్య విధానం ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నుకోబడిన ఎంపీలు, రాష్ట్ర శాసన సభల సభ్యులు ఉంటారు. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు కారు. జమ్మూ కాశ్మీర్లో శాసన సభ లేకపోవడంతో ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువ 708 నుంచి 700కి పడిపోయింది. రాష్ట్రాల్లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా, జార్ఖండ్, తమిళనాడులో 176 ఉన్నాయి. మహారాష్ట్రలో ఇది 175గా ఉంది. సిక్కింలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ ఏడు కాగా, నాగాలాండ్లో తొమ్మిది, మిజోరంలో ఎనిమిదిగా ఉంది.