దర్వాజ-జైపూర్
Rajasthan: పశ్చిమ, ఉత్తర రాజస్థాన్లోని వేలాది పశువులు మరణిస్తున్నాయి. lumpy skin disease వ్యాప్తి కారణంగా పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఏకంగా 1200 పశువులు చనిపోయినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. మూడు నెలల వ్యవధిలో దాదాపు 25 వేల పశువులకు ఈ చర్మ సంబంధ అంటువ్యాధి సోకిందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. ఒక్క జోధ్పూర్ జిల్లాలోనే గత రెండు వారాల్లో 254 పశువులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందాయని పశుసంవర్థక శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
అంటువ్యాధి తీవ్రమైన వ్యాప్తిని పరిగణనలోకి తీసుకుని, సంబంధిత డిపార్ట్మెంట్ ప్రభావిత ప్రాంతాలలో వైద్యుల బృందాలను సమీకరించింది. పశువుల కాపరులు తమ పశువులను వ్యాధి బారిన పడకుండా రక్షించడానికి ఒంటరిగా ఉంచాలని సూచించారు. ఆఫ్రికాలో పుట్టిన ఈ వ్యాధి ఏప్రిల్లో పాకిస్థాన్ మీదుగా భారత్కు వచ్చిందని పశుసంవర్ధక శాఖ తెలిపింది. మొదట్లో జైసల్మేర్, బార్మర్ వంటి సరిహద్దు జిల్లాల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉండేది కానీ ఇప్పుడు జోధ్పూర్, జలోర్, నాగౌర్, బికనీర్, హనుమాన్ఘర్ తదితర జిల్లాలకు వ్యాపించిందని పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ (వ్యాధుల నియంత్రణ) డాక్టర్ అరవింద్ జైట్లే తెలిపారు. తమ బృందాలు ఇప్పటికే ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈ వ్యాధి ప్రధానంగా ఆవులను ప్రభావితం చేస్తోందని, ముఖ్యంగా దేశవాళీ ఆవులకు శాపంగా మారిందనీ, ఇప్పటివరకు దాదాపు 25,000 గోవులు సోకినట్లు ఆయన చెప్పారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఆవులలో ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇతర వ్యాధులు దాడి కారణంగా మరణిస్తున్నాయని తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స, వ్యాక్సిన్లు లేవని, లక్షణాల ప్రకారం చికిత్స అందజేస్తామన్నారు. ప్రాథమిక లక్షణాలు చర్మంపై పాక్స్, అధిక జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలున్నాయని తెలిపారు. బాధిత గ్రామాల్లో పశువైద్యుల బృందాలను రప్పించాం. వారు గ్రామాల్లో విడిది చేసి వ్యాధి సోకిన పశువులకు చికిత్స అందిస్తున్నారని జాయింట్ డైరెక్టర్ (పశుసంవర్థక శాఖ)- జోధ్పూర్ సంజయ్ సింఘ్వి తెలిపారు.