
దర్వాజ- నంగునూర్
Nangnoor: నంగునూర్ మండలంలోని అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుచేస్తున్న రైతుల పొలాలను శుక్రవారం నాడు సిద్దిపేట్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి రామలక్ష్మి సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె రైతులతో మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ తోటల సాగు చేయడం వల్ల రైతులు మంచి లాభాలు పొందవచ్చని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలని కోరారు. అలాగే.. ఆయిల్ పామ్ సాగు చేసేవారికి డ్రిప్ ను 90 శాతంతో రాయితీ, మొక్కలను రాయితీతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కావున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆయిల్ ఫామ్ లో అంతర పంటలు వేసుకోవచ్చని తెలియజేశారు.
ఈ సందర్భంగా నంగునూర్ పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. గౌరవ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు గారి చొరవతో నంగునూర్ మండలానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడం గర్వకారణమన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టిసారించాలని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన ప్రతి రైతు 30 సంవత్సరాల వరకు తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందవచ్చని, ఇతర సాగు పంటలకు ఎకరానికి వాడే నీరు ఆయిల్ ఫామ్ సాగుకు ఐదు ఎకరాల వరకు వాడవచ్చునని వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రామలక్ష్మి, నంగునూర్ రైతు బంధు అధ్యక్షులు కిష్టారెడ్డి, నంగునూర్ పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తిప్పని నాగేందర్, ఎంపీటీసీ బెదురు తిరుపతి, హెచ్,ఓ భాస్కర్, నాయకులు విజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.