దర్వాజ-సిద్దిపేట

Nangunoor: Prof. Jayashankar Birth Anniversary: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను నంగునూర్ మండల కేంద్రంలోని ఘనంగా నిర్వహించారు. నంగునూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి తెరాస నాయకులు పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుపతి, మాజీ ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షులు చౌడుచెర్ల జయపాల్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. జయశంకర్ సార్ స్ఫూర్తి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిందని, తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించాలని ఆయన నిరంతరం పరితపించారని, మలి తెలంగాణ ఉద్యమం లో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత.. మన సీఎం కేసీఆర్ జయశంకర్ సార్ ఆకాంక్షలను, ఆశయాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
అనంతరం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ పోరాటానికి దిక్సూచి గా నిలిచారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.
అనంతరం మాజీ ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షులు చౌడుచెర్ల జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జయశంకర్ సార్ జయంతి, వర్ధంతిలను ఘనంగా నిర్వహించడం, ఆయన సేవలను స్మరించుకోవడం.. ఆయన ఆశయాలను అమలు చేయడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అలాగే.. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బెదురు తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా కొత్తపల్లి జయశంకర్ సార్ రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఆయన తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుపతి,మాజీ ఎంపీటీసీ ల ఫోరమ్ మండల అధ్యక్షులు చౌడుచెర్ల జయపాల్ రెడ్డి,తెరాస గ్రామశాఖ అధ్యక్షులు ఉల్లి మల్లయ్య యాదవ్, గుడికందుల ఆనందం, రచ్చ సిద్దు, చింతల రాంరెడ్డి, ఆకుబత్తిని రాము, దాసరి రమేష్, బద్ధుల కొమురయ్య, కొండిళ్ళ రాజు, దేవులపల్లి కనకయ్య, ఎర్ర బాబు తదితరులు పాల్గొన్నారు.