దర్వాజ-హైదరాబాద్
Hyderabad: తెలంగాణకు మరో ఆరుగురు న్యాయమూర్తులు వచ్చారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరిగింది. వివరాల్లోకెళ్తే.. న్యాయవాదులు ఏనుగుల వెంకట్ వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్, కాజా శరత్లను న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీన్వాసరావు, నామవరపు రాజేశ్వరరావులను అదనపు న్యాయమూర్తులుగా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదం నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం.. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు మంగళవారం లేదా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకంతో, ఇద్దరు అదనపు న్యాయమూర్తులతోపాటు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32 మందిగా ఉంది. కాగా, తెలంగాణ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టుల సంఖ్య 42. సీనియారిటీ ప్రకారం, అదనపు న్యాయమూర్తులు రెండేళ్ల తర్వాత శాశ్వత న్యాయమూర్తులు అవుతారు. జూలై 25, 2022న భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది.