దర్వాజ-భోపాల్
Dalit Rape Case: 13 ఏళ్ల దళిత అత్యాచార బాధితురాలిపై దాడి ఘటన మధ్యప్రదేశ్ లోని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. మైనర్ అత్యాచార బాధితురాలు ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్కు చేరుకోగా, ఆమెను రాత్రిపూట బలవంతంగా పోలీస్ స్టేషన్లో ఉంచి దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ఛతర్పూర్ నగరంలో చోటుచేసుకుంది. అయితే, బాధితురాలిపై దాడి చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటూ, ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారని ఎన్డీ టీవీ నివేదించింది. ఆ కథనం ప్రకారం.. ఈ విషయంపై సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘ఈ సంఘటన ఆగస్టు 30న జరిగిందని, ఈ కేసులో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని’ తెలిపారు. ఇది కాకుండా, భారతీయ శిక్షాస్మృతితో సహా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మైనర్ దళిత బాలికపై అత్యాచారం చేసినందుకు బాబు ఖాన్ అనే వ్యక్తిని సెప్టెంబర్ 3న అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
అత్యాచార బాధితురాలిని రాత్రిపూట పోలీస్ స్టేషన్లో ఉంచి దాడి చేసిన ఆరోపణలపై సిటీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ (ఎస్హెచ్ఓ) అనూప్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ మోహిని శర్మ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గురుదత్ శేషాలను సస్పెండ్ చేశారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) నుంచి అత్యాచారం ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ చెబుతున్నారు.
నన్ను బయటకు తీసుకెళ్ళి అమ్మాయిని బెల్టుతో కొడుతూ తన్నారు.. : బాధితురాలి తల్లి
బాధితురాలి తల్లి మాట్లాడుతూ, ఆగస్టు 27న బాలిక ఆడుకోవడానికి ఇంటి వెలుపలికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పారు. ఆ తర్వాత మరుసటి రోజు ఆయన అదృశ్యంపై ఫిర్యాదు చేశాం. ఆగస్ట్ 30న ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, బాబు ఖావ్ తనతో బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ తనపై అత్యాచారం చేశాడని చెప్పినట్టు పేర్కొన్నారు. మేము ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లామని, ఇద్దరు పోలీసులు తన స్టేట్మెంట్ మార్చాలని ఒత్తిడి చేసి ఆమెను కొట్టారని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి నన్ను బయటకు తీసుకెళ్లి వెనకాల ఉన్న అమ్మాయిని తన్నుతూ.. బెల్టుతో కొట్టాడని బాధితురాలి తల్లి తెలిపారు.
“మేము ఫిర్యాదు నమోదు చేయడానికి పోలీసు స్టేషన్కు వెళ్లాము. ఆమె స్టేట్మెంట్ మార్చమని ఇద్దరు పోలీసులు నా కుమార్తెపై ఒత్తిడి తెచ్చారు. వారు నా కుమార్తెను కొట్టారు. మరొక పోలీసు నన్ను బయటికి తీసుకెళ్లారు. లోపల, నా కుమార్తెను తన్నాడు.. బెల్ట్తో కొట్టారు” అని బాధితురాలి తల్లి ఆరోపించింది. బాలిక తల్లిదండ్రులు బయట వేచి ఉండగా రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు. ఆగస్టు 31న కూడా వారు తిరిగి పోలీసు స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ యాదవ్ను కోరగా, వారిని బయటకు పంపించారని బాలిక తల్లి ఆరోపించింది. చివరకు, సెప్టెంబర్ 1 సాయంత్రం పోలీసులు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేశారని, అయితే కిడ్నాప్ అభియోగాన్ని చేర్చలేదని ఆమె చెప్పారు.