దర్వాజ-హైదరాబాద్
Congress presidential elections: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై జరుగుతున్న ఊహాగానాల మధ్య, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సరైన నాయకుడు అని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంత రావు (వీహెచ్) అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి పేదల సమస్యలు తెలుసుననీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి’’ అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశి థరూర్ పేర్లు వినిపిస్తున్నాయి.
వీహెచ్ మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ 3,500 కిలోమీటర్ల పాదయాత్ర (భారత్ జోడో యాత్ర) చేస్తున్నారు. పిల్లలు నుంచి వృద్ధులు వరకు అందరూ పాల్గొంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందని” అన్నారు. అలాగే, ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు పాలపై విధించిన జీఎస్టీ అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నందున పేద ప్రజల సమస్యలను ఆయన బాగా తెలుసుకుంటారు. మీరు ముందు నడవండి, మేము మీ వెంట ఉన్నాము అని హనుమంతరావు అన్నారు.
అంతకుముందు, ఆయన మాట్లాడుతూ “దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరినీ నేను అభ్యర్థిస్తున్నాను.. గాంధీ కుటుంబంతో ప్రజలకు సుపరిచితం, అది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ కావచ్చు. రాహుల్ గాంధీ నిలబడకూడదనుకుంటే, ప్రియాంక గాంధీని ఎన్నుకోవాలి.. పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆమె ముందుకు రావాలి” అని అన్నారు. కాగా, ఆగస్టు 20 నాటికి అంతర్గత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.