దర్వాజ-హైదరాబాద్
Munugode Assembly constituency: రాష్ట్రంలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై నజర్ పెట్టయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు అన్ని రకాల ఉచితాలను కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు వినూత్నమైన, బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు రాజకీయ, మత ప్రచారకుడు కేఏ పాల్ ఓ అడుగు ముందుకేశారు. 59 మంది నిరుద్యోగులకు ఉచితంగా పాస్పోర్ట్లు, వీసాలు ఏర్పాటు చేసి అమెరికా పంపుతామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
పాల్ తన 59వ పుట్టినరోజు కానుకగా లాటరీ ద్వారా 59 మంది నిరుద్యోగులను యూఎస్కి పంపుతామని మంగళవారం ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గంలో 50 వేల మంది నిరుద్యోగులు ఉన్నారనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాల్ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేసి, సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల మధ్య నిరుద్యోగులు తమ రెజ్యూమ్లతో శ్రీ వారు హోమ్స్ గ్రౌండ్స్కు రావాలని కోరారు. “వచ్చేవారిలో 59 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. నేను పాస్పోర్ట్లు, అమెరికన్ స్పాన్సర్షిప్ వీసాలు ఏర్పాటు చేస్తాను” అని కేఏ పాల్ చెప్పారు. ఇంకా ఎక్కువ మంది నిరుద్యోగులు ముందుకు వస్తే 175 గ్రామాల నుంచి ఒక్కొక్కరిని అమెరికాకు పంపుతామన్నారు.
బీసీ కుటుంబంలో పుట్టి దళిత మహిళను పెళ్లి చేసుకున్నందుకు నిరుద్యోగుల సమస్యలను అర్థం చేసుకోగలను అని అన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామనీ, ప్రధాని నరేంద్రమోదీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వారు ఇప్పటివరకు చేసిందేమీ లేదని విమర్శించారు. “వారు ఏమైనా చేశారా? నిరుద్యోగుల సంఖ్య మాత్రం పెరిగింది’ అని ఆయన అన్నారు. కాగా, గత నెలలో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన సిట్టింగ్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల అనివార్యం అయింది. అక్టోబరు-నవంబర్ మధ్యలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేఏ. పాల్ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టాలని యోచిస్తోంది.