దర్వాజ-భోపాల్
Bhopal: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని సాంస్కృతిక, మతపరమైన ట్రస్టుల మంత్రి ఉషా ఠాకూర్ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మదర్సాలపై సర్వే చేయాలని డిమాండ్ చేశారు. నమోదుకాని మదర్సాలను మూసివేయాలని పేర్కొంటూ మంత్రి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆస్తులపై విచారణకు ఆదేశించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. “నేను పాఠశాల విద్యా శాఖకు లేఖ రాశాను. మధ్యప్రదేశ్ అంతటా పనిచేస్తున్న అన్ని మదర్సాల సర్వేను సిఫార్సు చేశాను” అని ఠాకూర్ చెప్పారు.
అయితే, సర్వే కోసం ఠాకూర్ పాఠశాల విద్యా శాఖకు లేఖ రాయడానికి ముందు, మైనారిటీల జాతీయ కమిషన్ (MCM) కూడా అదే సిఫార్సు చేసింది. ఈ ఏడాది మేలో భోపాల్లో పర్యటించినప్పుడు, ఎంసీఎం సభ్యుడు సయ్యద్ షాజాదీ మదర్సాలలో సరైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సర్వే చేయాలని సిఫార్సు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ రికార్డు ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 2,650 నమోదిత మదర్సాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి రాష్ట్ర ప్రభుత్వం నుండి సంవత్సరానికి 25,000 రూపాయల గ్రాంట్ను అందుకుంటుంది.
మధ్యప్రదేశ్లో కొత్త మదర్సాల రిజిస్ట్రేషన్ 2019 నుండి నిలిపివేయబడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. మదర్సాల రిజిస్ట్రేషన్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుంది. ఇది కేవలం నమోదిత వారికి మాత్రమే చేయబడుతుంది. మధ్యప్రదేశ్లో నమోదుకాని మదర్సాల సంఖ్యపై అధికారిక సమాచారం లేనప్పటికీ, దాదాపు 500-550 మదర్సాలు అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ భోపాల్లో కనీసం నాలుగు నమోదుకాని మదర్సాలను గుర్తించినట్లు పేర్కొంది.