దర్వాజ-హైదరాబాద్
Hyderabad: మునుగోడు ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైన అక్కడ విజయం సాధించాలని ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ 14 మంది సభ్యుల ప్యానెల్ను ప్రకటించింది. కొత్త స్టీరింగ్ కమిటీతో మునుగోడు ఉప ఎన్నికకు తెలంగాణ బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది.
వివరాల్లోకెళ్తే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక కోసం తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో 14 మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, నటి విజయశాంతి ఉన్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అయితే అందులో ఇద్దరు ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్లు లేవు.
కొత్త స్టీరింగ్ కమిటీతో మునుగోడు ఉప ఎన్నికకు రాష్ట్ర శాఖ సన్నాహాలు ప్రారంభించింది. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చినప్పుడు, ఉప ఎన్నికల సన్నాహాలను సమీక్షించారు. ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్ను సందర్శించిన అమిత్ షా.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్తో పాటు పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. మునుగోడు అసెంబ్లీ సీటును కైవసం చేసుకునేందుకు చేయాల్సిన ఉప ఎన్నికల సన్నాహాలపై మరింత దృష్టి సారించారు.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ pic.twitter.com/wGtJKUveUc
— BJP Telangana (@BJP4Telangana) September 22, 2022