దర్వాజ-ఉత్తరాఖండ్
Char Dham Yatra 2022: దేవభూమి లేదా దేవతల భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ బహుళ దేవాలయాలకు నిలయం. ఏడాది పొడవునా దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు. తాజాగా అక్కడి ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర 2022 ముగింపు తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్లో భక్తులు సందర్శించే లెక్కలేనన్ని మతపరమైన ప్రదేశాలు, చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. అయితే, చార్ ధామ్ యాత్ర అత్యంత ప్రముఖమైనది. ఈ యాత్ర లేదా తీర్థయాత్ర నాలుగు పవిత్ర స్థలాల పర్యటన.. వాటిలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లు ఉన్నాయి. హిందీలో, ‘చార్’ అంటే నాలుగు, ‘ధామ్’ మతపరమైన గమ్యస్థానాలను సూచిస్తుంది.
ఇప్పుడు, పవిత్ర ప్రయాణం చివరి దశలో ఉంది. చలికాలం సమీపిస్తున్నందున చార్ ధామ్లను మూసివేసే తేదీలను ఉత్తరాఖండ్ అధికారులు ప్రకటించారు. ఆ వివరాల ప్రకారం..
- గంగోత్రి ధామ్ అక్టోబర్ 26న మధ్యాహ్నం 12:01 గంటలకు మూసివేయబడుతుంది.
- శ్రీ కేదార్నాథ్ ధామ్ – అక్టోబర్ 27, 8:30 AM కు మూసివేయనున్నారు.
- యమునోత్రి ధామ్ పోర్టల్: అక్టోబర్ 27 మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో లో మూసివేయనున్నారు.
- బద్రీనాథ్ ధామ్: నవంబర్ 19, 3:35 PM గంటలకు మూసివేయనున్నారు.
- అక్టోబరు 10న హేమకుండ్ షైబ్, లోక్పాల్ తీర్థంలను మూసేయనున్నారు.
- కేదార్ మద్మహేశ్వర్ – నవంబర్ 21న మూసివేయనున్నారు.
- నవంబర్ 21న ఉఖిమఠ్లో మద్మహేశ్వర్ జాతర నిర్వహించబడుతుంది.
- కేదార్ తుంగనాథ్: నవంబర్ 7న మూసివేయనున్నారు.
ఎత్తైన హిమాలయ ప్రదేశాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు ప్రతి సంవత్సరం దాదాపు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి. మళ్లీ వేసవిలో (ఏప్రిల్ లేదా మే) తెరవబడతాయి. శీతాకాలం (అక్టోబర్ లేదా నవంబర్) ప్రారంభంతో మూసివేయబడతాయి.

చార్ ధామ్ యాత్రను సవ్యదిశలో పూర్తి చేయాలని నమ్ముతారు. అందువల్ల, యాత్ర యమునోత్రి నుండి మొదలై, గంగోత్రి వైపు, కేదార్నాథ్ మీదుగా సాగి, చివరకు బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది. ప్రయాణాన్ని రోడ్డు మార్గం లేదా విమానం ద్వారా పూర్తి చేయవచ్చు (హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి).
కొంతమంది భక్తులు దో ధామ్ యాత్ర లేదా కేదార్నాథ్, బద్రీనాథ్ అనే రెండు పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్ర కూడా చేస్తారు.